రేవంత్ రెడ్డి 'ఆర్ఎస్ఎస్' తోలుబొమ్మ: అసదుద్దీన్

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని ఆర్‌ఎస్‌ఎస్‌ కీలుబొమ్మ అంటూ ఆల్‌ ఇండియా మజ్లిస్‌-ఏ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు.

By అంజి  Published on  14 Nov 2023 3:15 AM GMT
Asaduddin Owaisi, Revanth Reddy, RSS puppet, Hyderabad

రేవంత్ రెడ్డి 'ఆర్ఎస్ఎస్' తోలుబొమ్మ: అసదుద్దీన్

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని ఆర్‌ఎస్‌ఎస్‌ కీలుబొమ్మ అంటూ ఆల్‌ ఇండియా మజ్లిస్‌-ఏ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. ''మాపై విమర్శించడానికి మీకు (రేవంత్ రెడ్డి) ఏమీ లేదు. మీరు మా బట్టలు, గడ్డాల గురించి మాట్లాడి మాపై దాడి చేస్తున్నారు. డాగ్ విజిల్ పాలిటిక్స్ అంటారు. నువ్వు ఆర్‌ఎస్‌ఎస్ కీలుబొమ్మవి. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఎలాంటి తేడా లేదు'' అని అసదుద్దీన్ ఒవైసీ నగరంలో జరిగిన బహిరంగ ర్యాలీలో అన్నారు. ఒవైసీ తన షేర్వానీ కింద ఖాకీ నిక్కర్ ధరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఆదివారం నాడు విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఒవైసీ స్పందించినట్లు తెలుస్తోంది.

''తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడిగా నిక్కర్‌ వేసుకుని ఏబీవీపీకి వెళ్లి, తెలుగుదేశంలో చేరి ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చారు. కాంగ్రెస్ గాంధీ భవన్‌ను మోహన్ భగవత్ స్వాధీనం చేసుకున్నారని, ఆయన ఎలా కావాలంటే అలా, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంగ్రెస్‌ని నడిపిస్తారని ఎవరో చెప్పారు'' అని ఏఐఎంఐఎం చీఫ్ అన్నారు. సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) నిరసనలను గుర్తుచేస్తూ, నిరసనకారులను వారు ధరించిన దుస్తులను బట్టి గుర్తించవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని ఒవైసీ అన్నారు. ఒవైసీ షేర్వానీ గురించి మాట్లాడినప్పుడు రేవంత్ కూడా అదే పని చేశారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మరో నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది.

Next Story