రేపే నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ..ఆర్టీసీ స్పెషల్ బస్సులు
చేప ప్రసాదం పంపిణీ కోసం హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
By Knakam Karthik
రేపే నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ..ఆర్టీసీ స్పెషల్ బస్సులు
మృగశిర కార్తెను పుసర్కరించుకుని ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ కోసం హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేప ప్రసాదం పంపిణీకి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ నెల 8వ తేదీన ఉదయం 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమై, 9న ఉదయం 9 గంటల వరకు కొనసాగనుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సారి 42 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. పంపిణీ కోసం ఫిషరీస్ శాఖ లక్ష చేప పిల్లలను సిద్ధంగా ఉంచింది.
చేప ప్రసాద కార్యక్రమాన్ని స్పీకర్ ప్రసాద్రావు ప్రారంభిస్తారని, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొంటున్నట్లుగా ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ సాయికుమార్ వివరించారు. బత్తిని కుటుంబసభ్యులైన బత్తిని గౌరీశంకర్ గౌడ్తో కలిసి ఏర్పాట్లను సాయికుమార్ శుక్రవారం సాయంత్రం ఆయన పర్యవేక్షించారు. సాయికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పొన్నం పర్యవేక్షణలో అన్ని వసతులను కల్పిస్తున్నట్లుగా వెల్లడించారు.
దీంతోపాటు 14 డిపోల నుంచి 140 ప్రత్యేక బస్సులు కూడా నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు ఈ బస్సులు ప్రత్యేకంగా చేప ప్రసాదం పంపిణీకి నడుపుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్, జేబీఎస్, ఈసిఐఎల్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, దిల్షుఖ్ నగర్, ఎన్జీవో కాలనీ, ఉప్పల్, రాజేంద్రనగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.