యువతకు రూ.3,00,000 వరకు రుణం.. రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
By అంజి Published on 16 March 2025 7:21 AM IST
యువతకు రూ.3,00,000 వరకు రుణం.. రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఓబీఎంఎంఎస్ ఆన్లైన్ పోర్టల్లో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం రూ.3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనుంది. 60 శాతం నుంచి 80 శాతం వరకు రాయితీ ఇస్తారు. దాదాపు 5 లక్షల మందికి రూ.6 వేల కోట్ల ఖర్చుతో ఈ రుణాలను అందించనుంది. పూర్తి వివరాలకు https://tgobmms.cgg.gov.in/ ను విజిట్ చేయండి.
దరఖాస్తుల స్వీకరణ తర్వాత ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్లు పరిశీలించనున్నారు. ఆ తర్వాత లబ్ధిదారుల లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఈ స్కీమ్కు ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న రుణ మంజూరు పత్రాలు అందజేస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి తుది జాబితాను ప్రకటిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తే.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఐటీడీఏ అధికారులను సంప్రదించాలని చెప్పింది.