100 రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే రెండు హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చిందని, 100 రోజుల్లో 6 హామీలను నెరవేరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు

By అంజి  Published on  11 Dec 2023 1:00 AM GMT
Congress guarantees, Telangana, Deputy CM Bhatti Vikramarka

100 రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

ఖమ్మం: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హామీలను కాంగ్రెస్‌ ప్రజాప్రభుత్వం నెరవేర్చిందని, 100 రోజుల్లో ఆ ఆరు హామీలను నెరవేరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు ఆదివారం నాడు అన్నారు. మరో ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఖమ్మం చేరుకున్న ఆయనకు వారి మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ.. రాబోయే 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన నాలుగు హామీలను నెరవేరుస్తుందని అన్నారు.

సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ప్రజాప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఉద్ఘాటించారు. "ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం మా ప్రభుత్వం పని చేస్తుంది" అని అన్నారు. మహిళా సాధికారత కోసం చేస్తున్న కృషిలో భాగంగా వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చుల మొత్తాన్ని రూ. 10 లక్షలకు పెంచామని, రెండో హామీని నెరవేర్చామని తెలిపారు. రెండు హామీలను తక్షణమే అమలు చేయడం బీఆర్‌ఎస్ నేతలకు చెంపపెట్టు లాంటిదని అన్నారు.

ఇళ్ల స్థలాలు, పోడు భూముల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పాలనలో జర్నలిస్టులు లేనిపోని బాధలు పడ్డారని భట్టి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, గత ప్రభుత్వం వారికి ఇళ్ల స్థలాలు అమలు చేయకుండా ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాలకు గాను 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అద్భుతంగా గెలిపించినందుకు ఖమ్మం ప్రజలకు విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రమైన పట్టణానికి చేరుకున్న మంత్రులకు కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, వైఎస్సార్‌టీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

Next Story