హైదరాబాద్: 2025 - 26 ఖరీఫ్ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. 5 జూన్ 2025 నాటికి భూ భారతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు అర్హులుగా పేర్కొన్నారు. రైతు భరోసా అప్లికేషన్ ఫారం, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ను సంబంధిత ఏఈవోలకు ఈ నెల 20 వరకు అందించాలన్నారు. ఇది వరకే రైతు భరోసా పొందుతున్నవారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం భూభారతి పోర్టల్లో నమోదైన భూ విస్తీర్ణం, రైతుల వివరాల ఆధారంగానే రైతుభరోసా అందజేసేందుకు నిర్ణయించింది.
రైతుభరోసా పథకం కింద ఎకరానికి రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.12వేలు చెల్లించనుంది. ఆర్బీఐ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ప్లాట్ఫాం కుబేర్ను ఉపయోగించి రైతుభరోసా సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పట్టాదారుల వివరాలు, బ్యాంక్ వివరాల్లో లోపాలు ఉంటే అవసరమైన వాటిని సరిదిద్ధి అధికారులు పూర్తిగా ధ్రువీకరించిన తరువాతనే ప్రభుత్వానికి పంపించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అటు భూ రికార్డుల్లో గతంలో ఉన్న పలు లోపాలను ప్రభుత్వం సరిదిద్దడం కోసం ప్రత్యేకంగా ఓ ప్రొఫార్మాను రూపొందించి అందులో డేటాను నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది.