Telangana: రాష్ట్రంలో పిడుగుపాటుకు 9 మంది మృతి
తెలంగాణలో పిడుగుపాటు కారణంగా మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు.
By - Knakam Karthik |
తెలంగాణలో పిడుగుపాటు కారణంగా మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే, నిర్మల్ జిల్లా పెంబి మండలం ఎంగేలాపూర్ శివారులో పొలం నుంచి వస్తుండగా ముగ్గురు వ్యక్తులపై పిడుగు పడింది. ఆ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఆలకుంట ఎల్లయ్య(37), భార్య లక్ష్మీ (32), మేనమామ బండారి వెంకన్న(50)గా గుర్తించారు.
మరోవైపు జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం భూంపురం గ్రామంలో కొందరు పత్తి పని చేస్తున్నారు. అక్కడ పిడుగు పాటుకు గురై ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యారు. వారిని కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉండగా, ఒక యువకుడు ఉన్నారు. మృతులు భూంపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ, సర్వేస్, సౌభాగ్యగా గుర్తించారు.
అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం చీమగూడెం గ్రామంలో పిడుగుపాటుకు పాయం నర్సయ్య(50) అనే రైతు మృతిచెందాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో బర్రెల కాసేందుకు వెళ్లిన మహేష్(32), మధిర సమీపంలోని మడిపల్లి గ్రామానికి చెందిన గడిపూడి వీరభద్రరావు(50) అనే రైతు పిడుగుపాటుకు మృతి చెందారు.