ఎస్సై, కానిస్టేబుల్‌ ఫైనల్‌ ఎగ్జామ్‌కు.. 1,11,209 మంది అర్హత

111209 Members Qualified In Police Events Says Tslprb. తెలంగాణలో ఖాళీగా ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.

By అంజి  Published on  6 Jan 2023 2:48 PM GMT
ఎస్సై, కానిస్టేబుల్‌ ఫైనల్‌ ఎగ్జామ్‌కు.. 1,11,209 మంది అర్హత

తెలంగాణలో ఖాళీగా ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. నియామక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ ఎగ్జామ్‌ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్‌ ఈవెంట్స్ నిర్వహించారు. 83,449 మంది పురుషులు, 27,760 మంది మహిళలు సహా 1,11,209 మంది అభ్యర్థులు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ( పీఈటీ)లో అర్హత సాధించి అర్హత సాధించారని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) శుక్రవారం ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల వివిధ వేదికలపై మొత్తం 2,07,106 మంది అభ్యర్థుల కోసం నిర్వహించిన పీఎంటీ/పీఈటీ టెస్టులు విజయవంతంగా ముగిశాయి. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఇది 2018-19లో జ‌రిగిన రిక్రూట్‌మెంట్‌తో పోల్చితే 5.18 శాతం ఎక్కువ. 2018-19లో 48.52 శాతం మంది క్వాలిఫై అయ్యారు. సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్/లేదా తత్సమాన, పోలీస్ కానిస్టేబుల్ (సివిల్)/లేదా తత్సమానం, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్, డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల యొక్క 17,516 ఖాళీలను బోర్డు నోటిఫై చేసిన విషయం తెలిసిందే.

ఇక మార్చి 12 నుంచి ఎస్సై, కానిస్టేబులు మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 9న సివిల్‌ ఎస్‌ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 23న అన్ని రకాల కానిస్టేబుల్‌ పోస్టులకు మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుంది. హాల్‌టికెట్లను ఎప్పటినుంచి డౌన్‌లోడ్‌ చేసుకోచ్చనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది.

Next Story