రాహుల్ గాంధీ యాత్రలో ఎంతో మంది వాలంటీర్లు

100 TS social organizations join Rahul Gandhi against hate in BJY. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో గురువారం ప్రారంభమైంది. మూడు రోజుల విరామం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Oct 2022 11:39 AM GMT
రాహుల్ గాంధీ యాత్రలో ఎంతో మంది వాలంటీర్లు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో గురువారం ప్రారంభమైంది. మూడు రోజుల విరామం అనంతరం రాహుల్ తెలంగాణలో రెండో రోజు పాదయాత్రను మొదలు పెట్టారు. మక్తల్ శివారులోని సబ్ స్టేషన్ నుంచి ఉదయం 6.30 గంటలకు భారత్ జోడో పాదయాత్రను రాహుల్ గాంధీ పునఃప్రారంభించారు. రాహుల్ పాదయాత్ర కోసం.. తెలంగాణ పీసీసీ భారీ ఏర్పాట్లు చేసింది. పాదయాత్రలో రాహుల్‌గాంధీ పలు ప్రజా సంఘాల ప్రతినిధులను, కార్మికులు, నారాయణపేట జిల్లాకు చెందిన బీడీ కార్మికులతో రాహుల్‌గాంధీ ముచ్చటిస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

పాదయాత్రలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ పాల్గొన్నారు. ఇవాళ దాదాపు 26 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. జక్లేర్ మీదుగా గుడిగంట్లకు రాహుల్ పాదయాత్ర చేరుకోనుంది. నేతలతో సమావేశం తరువాత రాహుల్ గాంధీ గుడిగంట్లలో రాత్రికి బస చేయనున్నారు. ఇక స్వరాజ్ ఇండియా ఆధ్వర్యంలో యుపి, బీహార్, హర్యానా, కేరళ, కర్ణాటక నుండి చాలా మంది వాలంటీర్లు కూడా యాత్రలో చేరారు. యాత్రలో 300 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. 40 మంది మహిళలు ఉన్నారు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఇతర పార్టీల నేతలతో కలిసి రాహుల్ గాంధీ కంటే 2 కిలోమీటర్లు ముందుగా నడిచారు.

దాదాపు 100 స్వతంత్ర సంస్థలు, వేలాది మంది సామాజిక కార్యకర్తలు తెలంగాణలో భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర ప్రధాన లక్ష్యాలను ప్రజలకు తెలియజేయనున్నారు. ద్వేషం, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయడం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య హక్కులు, లౌకికవాదాన్ని కాపాడడం వంటి విషయాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. తమ భాగస్వామ్యం కాంగ్రెస్ పార్టీకి రాజకీయ మద్దతు గురించి కాదని, ముప్పులో ఉన్న భారతదేశ విలువల కోసమని స్పష్టం చేశారు. అదే సమయంలో సివిల్ సొసైటీ వర్కింగ్ గ్రూప్ కు చెందిన K. సజయ, కిరణ్ విస్సా, జాహిద్ ఖాద్రీ ఈ ఉదయం 7 గంటలకు రాహుల్ గాంధీతో మాట్లాడారు.

Next Story