ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎప్పుడూ చెప్పలేదు - మంత్రి పువ్వాడ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2019 8:52 AM GMT
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎప్పుడూ చెప్పలేదు - మంత్రి పువ్వాడ

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎప్పుడూ ప్రకటించలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతోనే కార్మికులు సమ్మె చేస్తున్నారని విమర్శించారు. గత వారం రోజులుగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్దమైందన్నారు పువ్వాడ. 2వేల 969 ఆర్టీసీ, వెయ్యి అద్దె బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాధ్యాతారాహిత్యంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు . మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌, మిగతా రాష్ట్రాల్లో బీజేపీ విలీనం చేసిందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆర్టీసీ ఉద్యోగులను కేసీఆర్ బాగా చూసుకుంటున్నారని చెప్పారు. బడ్జెట్‌లో ఆర్టీసికి 3వేల కోట్లు కేటాయించారన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ గురించి బీజేపీ మాట్లాడటం బాగాలేదన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న రైల్వేలను బీజేపీ ప్రైవేట్ పరం చేసిందని విమర్శించారు మంత్రి పువ్వాడ. బస్ పాస్‌లు త్వరలోనే చెల్లుబాటు అవుతాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు.

Next Story