ముందు జాగ్రత్తలు పాటిద్దాం.. కరోనా వైరస్ సంక్రమణ అరికడదాం..
By Newsmeter.Network Published on 3 March 2020 11:01 AM GMTరాష్ట్రంలో తొలి కోవిడ్-19 కేసు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ సమావేశం నిర్వహించింది. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో వైద్య, ఆరోగ్య, పురపాలక, పంచాయితీరాజ్ల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా శాఖ కార్యదర్శులు, శాఖాధిపతులతో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొవిడ్-19 వస్తే చనిపోతారన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని, గత వైరస్లతో పోల్చితే కరోనా వైరస్లో మరణాల రేటు తక్కువగా ఉందన్నారు.
హైదరాబాద్తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో హోర్డింగ్లు, వాల్ పోస్టర్లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. దానిలో భాగంగా ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ.. ‘ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ సంక్రమణ అరికడదాం’అని ఓ పోస్టర్ విడుదల చేసింది. వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాల సమాచారం కోసం హెల్ప్లైన్ 040-24651119 నెంబర్ ను సంప్రదించాలని సూచించింది.