తెలంగాణ పోలీసుల గుడ్‌న్యూస్‌: సొంతూళ్లకు వెళ్లేవారికి ఈ-పాస్‌లు

By సుభాష్  Published on  3 May 2020 10:17 AM GMT
తెలంగాణ పోలీసుల గుడ్‌న్యూస్‌: సొంతూళ్లకు వెళ్లేవారికి ఈ-పాస్‌లు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనాను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా మే 17వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు, ఉద్యోగం చేసేవారు ఇరుక్కుపోయాయి రాష్ట్రంలోనే ఉండిపోయారు. లాక్‌డౌన్‌తో సొంత ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అలాంటి వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు శుభవార్త వినిపించారు. వారి కోసం ఈ-పాస్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వనున్నారు తెలంగాణ పోలీసులు. ఈ-పాస్‌ పొందాలంటే ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. తెలంగాణ పోలీస్‌ డిజిటల్‌ పాస్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టమ్‌ పేరిట ఓ వెబ్‌ సైట్‌లో కొత్త ఆప్షన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది.

సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు https://tsp.koopid.ai/epass లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక కుటుంబానికి చెందిన వారికి రోజుకు ఒక పాస్‌ మాత్రమే జారీ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ-పాస్‌ కావాలనుకునే వారు పూర్తి పేరు, మెయిల్‌ఐడీ, ఫోన్‌ నెంబర్‌, ప్రాంతం పేరు తదితర వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత పోలీసులు పరిశీలించి ఈ-పాస్‌ను జారీ చేస్తామని డీజీజీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

కాగా, ఈ-పాస్‌ విధానానికి భారీగా స్పందన వస్తోంది. ఈ-పాస్‌ కోసం భారీగా దరఖాస్తులు రావడంతో ఈ రోజు ఉదయం నుంచి 7వేల పాసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక పరిశీలనలో 10వేల దరఖాస్తులు ఉన్నాయి. ఆదివారం భారీ మొత్తంలో దరఖాస్తులు రావడంతో తాత్కాలికంగా నిలిపివేసి తిరిగి 3.30 గంటల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.



Next Story