పోజులు ఆపండి.. ఆటపై దృష్టి పెట్టండి.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Feb 2020 10:43 AM GMT
పోజులు ఆపండి.. ఆటపై దృష్టి పెట్టండి.!

టీమిండియా క్రికెట‌ర్లు ఇషాంత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్ ట్విట్ట‌ర్‌లో షేర్‌ చేసిన ఫొటోపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. కివీస్‌తో జ‌రిగిన‌ తొలి టెస్టులో టీమిండియా ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చెందిన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై అభిమానులు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌పై కారాలు, మిరియాలు నూరుతున్నారు.



అయితే.. ఆస‌లే కోపం మీద ఊగిపోతున్న అభిమానుల‌కు.. పుండు మీద కారం జ‌ల్లిన‌ట్టుగా.. రెండో టెస్టు ఆడేందుకు క్రైస్ట్‌చర్చ్‌కు వెళ్తున్నామని కెప్టెన్‌ కోహ్లీ, కీప‌ర్ రిషబ్‌ పంత్‌, మయాంక్‌ అగర్వాల్‌తో దిగిన ట్రావెల్‌ ఫొటోను ఇషాంత్‌ శర్మ తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. అదే ఫొటోను మయాంక్ అగ‌ర్వాల్ కూడా వేరే క్యాప్ష‌న్ పెట్టి పోస్ట్‌ చేశాడు. దీనిపై ఇప్పుడు ఆట‌గాళ్లను అభిమానులు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.



తొలి టెస్టులో కివీస్ ముందు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌ని.. మీరు రాక్‌స్టార్స్ గా మారి.. సోషల్‌ మీడియాలో పోజులు కొట్టడం ఆపి.. ఆట‌పై దృష్టి పెట్టాల‌ని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. ఇదిలావుంటే సిరీస్‌లో రెండవ‌ టెస్ట్.. క్రైస్ట్‌చర్చ్ వేదిక‌గా ఈ నెల 29న ప్రారంభంకానుంది.

Next Story