కాపాడాల్సిన పోలీసులే కాటేశారు.. టీచర్పై గ్యాంగ్రేప్
By అంజి Published on 15 Feb 2020 8:38 PM IST
ఉత్తరప్రదేశ్లో అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కామాంధుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ, నిందితులను పట్టుకోవాల్సిన పోలీసులే.. కామంతో రెచ్చిపోయారు. ఈ అమానుషఘటన గోరఖ్పూర్ జిల్లాలో జరిగింది.
తాజాగా జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఓ లేడీ టీచర్పై గ్యాంగ్ రేప్కి పాల్పడిన ఘటన గోరఖ్నాథ్లో చోటు చేసుకుంది. పాఠశాల సమయం తర్వాత, సొదరి ఇంటికి వెళ్లి వస్తున్న ఓ లేడీ టీచర్ను ఇద్దరు పోలీసులు బలవంతంగా బైక్ ఎక్కించుకున్నారు. వ్యభిచారం గృహం నుంచే కదా వస్తున్నావంటూ బలవంతంగా లాక్కెళ్లారు. తనకు ఏమీ తెలియదని, తన తల్లి వెనుక వస్తోందని చెప్పినా పోలీసుల రూపంలో ఉన్న ఆ మానవమృగాలు ఏ మాత్రం వినలేదు. దగ్గరలోని రైల్వేస్టేషన్ దగ్గరలో ఉన్న ఓ పాడుబడ్డ గదికి తీసుకెళ్లి అత్యచారానికి పాల్పడ్డారు. వారిని తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఆ టీచర్ను పోలీసులు కొట్టారు. దీంతో ఆ టీచర్ ఒంటిపై గాయాలు అయ్యాయి. ఇంటికి వెళ్లాలని, తనను వదిలిపెట్టాలని వేడుకున్న మృగాళ్లల మీద పడి దారుణానికి ఒడిగట్టారు.
అనంతరం ఆమె చేతిలో రూ.600 పెట్టి వ్యభిచారిని ముద్రించేందుకు ప్రయత్నించారు. అక్కడి నుంచి ఎలాగో అలా ఇంటికి చేరుకున్న బాధితురాలిని.. ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత స్థానిక పోలీస్స్టేషన్లో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందతున్న యువతి నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే ఆమె చెప్పిన మాటలపై తమకు అనుమానాలు ఉన్నాయని పోలీసులు చెప్పడం గమనించదగ్గ విషయం. అక్కడి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. విచారణ జరుగుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.