అందుకే 14న ఇసుక దీక్ష: అచ్చెన్నాయుడు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 7:35 AM GMT
అందుకే 14న ఇసుక దీక్ష: అచ్చెన్నాయుడు

ముఖ్యాంశాలు

  • వైసీపీ ప్రభుత్వం ఇసుకను అమ్ముకుంటోంది: టీడీపీ నేత అచ్చెన్నాయుడు
  • వైసీపీ ప్రభుత్వమే ఇసుక కొరతను సృష్టించింది: టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఇసుకను అమ్ముకుంటోందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇసుక కృతిమ కొరతను నిరసిస్తూ ఈ నెల 14న ఇసుక దీక్ష చేపడుతున్నామన్నారు. ఇసుక మాఫియా చేస్తున్న వారిపేర్లతో ఛార్జ్‌ షీట్‌ను రిలీజ్‌ చేశారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక ఏ రకంగా రవాణా చేస్తున్నారో తెలియజేస్తామని.. ఇసుక దీక్షకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అచ్చెన్నాయుడు కోరారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వమే కృతిమ ఇసుక కొరతను సృష్టించిందన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. రోడ్డున పడ్డ అన్ని వర్గాలకు బాసటగా నిలిచేందుకు ఇసుకదీక్ష చేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల వారు ఇసుక దీక్షకు సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేశారు.

సామాన్య మానవుడి జీవనాన్ని రక్షించేందుకు ఇసుక దీక్ష చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న 209 రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆలపాటి ఆరోపించారు. పదుల సంవత్సరాలుగా లేని ఇసుక కొరత ఇప్పుడేందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇసుక వారోత్సవాలా, మాఫియా వారోత్సవాలా.. ఆన్‌లైన్‌లో ఇసుక ఎవరికి దొరుకుతుందో వైసీపీ చెప్పాలని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

వైసీపీ ప్రభుత్వం తెలుగు భాష మీద అనాలోచిత నిర్ణయం తీసుకుందని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. తెలుగు రాష్ట్రంలో సీఎం జగన్‌ తెలుగును వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. వెంకయ్యనాయుడు వంటి వారిని వ్యతిరేకించే స్థాయి జగన్‌కు లేదన్నారు. వైసీపీ టీమ్‌ మొత్తం ఇసుక మీదే బ్రతికేస్తోందని బొండా ఉమామహేశ్వరావు ఎద్దేవా చేశారు.

Next Story