ఏపీ: రేపటి నుంచి మళ్లీ లాక్‌డౌన్‌

By సుభాష్  Published on  27 Jun 2020 11:17 AM GMT
ఏపీ: రేపటి నుంచి మళ్లీ లాక్‌డౌన్‌

ఏపీలోకరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత టెన్షన్‌ మొదలైంది. ఇప్పటి కేసు సంఖ్య పెరుగుతుండటంతో అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఇక తాజాగా శ్రీకాళహస్తిలో మళ్లీ లాక్‌డౌన్‌ అమలు చేయబోతున్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్‌ శ్రీకాంత్‌ లాక్‌డౌన్‌పై ప్రకటన చేశారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా నిబంధనలు పాటిస్తూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. వ్యాపారస్తులు కూడా తమ తమ వ్యాపారాలు కొనసాగించుకోవచ్చన్నారు.

ఇక మధ్యాహ్నం ఒంట గంట తర్వాత పూర్తిగా లాక్‌డౌన్‌ ఉంటుందని తెలిపారు. బయటకు వచ్చిన వారు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక వేళ మాస్కులు ధరించకపోతే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

కాగా, ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 24,458 మంది నుంచి రక్త నమూనాలను సేకరించగా, 796 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ఏపీ ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 740 మంది ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51 మంది.. ఐదుగురు విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 12285కి చేరింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

Next Story