ఐపీఎల్ ఫైనల్‌ను వర్షం అడ్డుకుంటే.. విజేత ఎవరంటే.?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

By Medi Samrat
Published on : 2 Jun 2025 11:51 AM

ఐపీఎల్ ఫైనల్‌ను వర్షం అడ్డుకుంటే.. విజేత ఎవరంటే.?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. రోజంతా మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మితమైన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్‌కు చేరుకున్నాయి. రెండు జట్లు ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. బెంగళూరు తమ చరిత్రలో మూడుసార్లు ఫైనల్‌కు చేరుకోగా, పంజాబ్ ఇంతకు ముందు ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరుకుంది. అది కూడా 2014లో.

జూన్ 3, మంగళవారం ఆట పరిస్థితులను నిర్ణయించడంలో వాతావరణం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అహ్మదాబాద్, సమీప ప్రాంతాలలో తేలికపాటి నుండి మితమైన వర్షాలు కురుస్తాయి. అహ్మదాబాద్‌లో ఉష్ణోగ్రత 37 డిగ్రీలు ఉంటుందని, ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అహ్మదాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ అరుణ్‌కుమార్ దాసానే అన్నారు. IPL 2025 ఫైనల్ మ్యాచ్ మొదట జూన్ 25న కోల్‌కతాలో జరగాల్సి ఉంది. వర్షాకాలంలో కోల్ కతా నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో, వాతావరణ కారణాల వల్ల మ్యాచ్‌ను ఈడెన్ గార్డెన్స్ నుండి మార్చారు. క్వాలిఫైయర్ 2, ఫైనల్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంకు తిరిగి కేటాయించారు. జూన్ 1న జరిగిన క్వాలిఫైయర్ 2 వర్షం కారణంగా ప్రభావితమైంది. టాస్ తర్వాత రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయింది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ చివరికి రాత్రి 9:44 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు, ఫైనల్ మ్యాచ్ సమయంలో కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.

ఫైనల్‌ మ్యాచ్ జూన్ 3న నిర్వహించనున్నారు. అయితే వీలు కుదరకపోతే రిజర్వ్ డే ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయినా, మ్యాచ్ నిర్వహణ సాధ్యం అవకపోతే జూన్ 4న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రిజర్వ్ డే రోజు ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణకు ఇబ్బంది కలిగితే.. కనీసం 5 ఓవర్ల పాటు మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ రెండు రోజులు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాని పక్షంలో పంజాబ్ జట్టు ఐపీఎల్ విజేతగా అవతరిస్తుంది. లీగ్ స్టేజీలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు విజేతగా నిలుస్తుంది.

Next Story