ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం.. వినిపించనున్న పేర్లు ఇవే..!
జూలై 5న జరిగే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో కొన్ని ప్రముఖ పేర్లు వినిపించనున్నాయి.
By Medi Samrat
జూలై 5న జరిగే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో కొన్ని ప్రముఖ పేర్లు వినిపించనున్నాయి. విరాట్ కోహ్లీ అన్నయ్య వికాస్ కోహ్లీ కుమారుడు ఆర్యవీర్ కోహ్లీ (15), జూలై 5న జరగనున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) వేలానికి షార్ట్లిస్ట్ చేసిన ఆటగాళ్ల ప్రారంభ డ్రాఫ్ట్లో భాగంగా ఉన్నాడు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ (17) కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 స్థాయిలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. మేఘాలయపై 297 పరుగులు చేశాడు. అతను కేటగిరీ Bలో ఉన్నాడు. అతని తమ్ముడు వేదాంత్ (15), ఢిల్లీ అండర్-16 తరపున ఇప్పటికే ఆడాడు.
ఆర్యవీర్ కోహ్లీ లెగ్ స్పిన్నర్. విరాట్ కోహ్లీ లాగే రాజ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు. ఆర్యవీర్ కూడా కేటగిరీ సిలో స్థానం పొందాడు. గత సీజన్లో అతను ఢిల్లీ అండర్-16 తరపున రిజిస్టర్డ్ ఆటగాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో రెండు కొత్త జట్లు వచ్చాయి. ఔటర్ ఢిల్లీ, న్యూఢిల్లీ జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. 2024 డిపిఎల్లో, సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, పురానీ దిల్లీ 6 జట్లు ఉన్నాయి.
ఆయుష్ బడోని, అనుజ్ రావత్, ప్రియాంష్ ఆర్య, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, దిగ్వేష్ రతి, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, సుయాష్ శర్మ వంటి ఆటగాళ్ళు 2024 డిపిఎల్ టి20లో ఆడారు.