విరాట్‌ వరల్డ్ రికార్డు.. 146 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో తొలి బ్యాటర్

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ ఓటమిపాలైనా.. టీమిండియా స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మాత్రం వరల్డ్‌ రికార్డును సాధించాడు.

By Srikanth Gundamalla  Published on  29 Dec 2023 7:00 AM GMT
virat kohli, world record, team india ,

విరాట్‌ వరల్డ్ రికార్డు.. 146 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో తొలి బ్యాటర్

సౌతాఫ్రికాతో టీమిండియా టెస్టు సిరీస్‌ ఆడుతోంది. రెండు టెస్టు మ్యాచుల్లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని చూసింది. ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో భారత్‌పై సౌతాఫ్రికా గెలిచింది. అయితే.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ ఓటమిపాలైనా.. టీమిండియా స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మాత్రం వరల్డ్‌ రికార్డును సాధించాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక సార్లు 2వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు విరాట్‌ కోహ్లీ ఏడు సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఓటమిపాలైనప్పటికీ... స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం అరుదైన ఘనత సాధించాడు. కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 38, రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 146 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో ఏడు క్యాలెండర్‌ సంవత్సరాల్లో 2000 పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా అవతరించాడు. ఈ ఏడాది కోహ్లీ రెండు ఫార్మాట్లలో కలిపి 2048 పరుగులు చేశాడు. అంతకుముందు 2012 ఏడాదిలో(2186 పరుగులు), 2014(2286 పరుగులు), 2016(2595 పరుగులు), 2017(2818 పరుగులు), 2018(2735 పరుగులు), 2019(2455 పరుగులు) చేశాడు విరాట్ కోహ్లీ. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లంతా విఫలమయ్యారు. సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరారు. కానీ.. విరాట్‌ ఒక్కడే ఒంటి పోరాటం చేశాడు. 76 పరుగులు చేశాడు. 2023 ఏడాదిలో దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడిన చివరి టెస్టు మ్యాచ్‌. ఇక రెండో టెస్టు మ్యాచ్‌ జనవరి జనవరి 3 నుంచి ఏడో తేదీ వరకు జరగనుంది.

Next Story