విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. ఆ ఘ‌న‌త సాధించిన తొలి భార‌తీయుడు

Virat Kohli Becomes 1st Indian To Reach 200 Million Followers On Instagram.టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, రికార్డుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2022 5:29 AM GMT
విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. ఆ ఘ‌న‌త సాధించిన తొలి భార‌తీయుడు

టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, రికార్డుల రారాజు, ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును నెల‌కొల్పాడు. అయితే.. ఈ రికార్డు క్రికెట్‌లో కాదండోయ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో. అవునండీ ఇన్‌స్టాలో 200 మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకున్న తొలి భార‌తీయుడిగా విరాట్ ఘ‌న‌త సాధించాడు. క్రీడారంగానికి చెందిన వారిలో స్టార్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్లు మెస్సీ, క్రిస్టియానో రోనాల్డోలు మాత్ర‌మే కోహ్లీ క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో ఫాలోవ‌ర్లు క‌లిగి ఉన్నారు.

దీనిపై విరాట్ కోహ్లీ స్పందించాడు. '200 మిలియన్ల మంది! నాకు మద్దతుగా నిలుస్తున్న ఇన్‌స్టా ఫ్యామిలీకి ధన్యవాదాలు' అంటూ ఫాలోవర్లను ఉద్దేశించి కోహ్లి ఓ వీడియో షేర్‌ చేశాడు. దీనిపై అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 'మా గుండెల్లో నీ స్థానం ఎప్పుడూ పదిలం.. నువ్వు ఎల్ల‌ప్పుడూ కింగ్ కోహ్లివే' అంటూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

2021 టీ20 ప్రపంచకప్ త‌రువాత టీ20 సార‌థ్య బాధ్య‌త‌ల‌ను కోహ్లీ వ‌దులుకోగా.. వ‌న్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ అత‌డిని త‌ప్పించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ ఘోర పరాజయం నేపథ్యంలో టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా విరాట్ త‌ప్పుకున్నాడు. అత‌డి స్థానంలో మూడు ఫార్మాట్ల‌లో ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ భార‌త జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

ఇక భార‌త జ‌ట్టు జూన్ 9 నుంచి 19 వ‌ర‌కు 5 టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌ను ద‌క్షిణాఫ్రికాతో ఆడ‌నుంది. ఈ సిరీస్‌కు సీనియ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, బుమ్రాల‌కు విశ్రాంతి నిచ్చింది బీసీసీఐ.

Next Story