చ‌రిత్ర సృష్టించిన భ‌వీనాబెన్.. టేబుల్ టెన్నిస్‌లో ర‌జ‌తం

Tokyo Paralympics Bhavina Patel Wins Silver Medal.టోక్యో వేదిక‌గా జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త్‌కు తొలి ప‌త‌కం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Aug 2021 3:03 AM GMT
చ‌రిత్ర సృష్టించిన భ‌వీనాబెన్.. టేబుల్ టెన్నిస్‌లో ర‌జ‌తం

టోక్యో వేదిక‌గా జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త్‌కు తొలి ప‌త‌కం వ‌చ్చింది. టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో ఆమె ర‌జ‌త ప‌త‌కం సాధించింది. ఫైన‌ల్లో ఆమె చైనా ప్లేయర్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ సీడ్‌ యింగ్‌ జావో చేతిలో 0-3 తేడాతో ఓడిపోయింది. భవీనాపై 7-11, 5-11, 6-11 స్కోర్‌తో జయకేతనం ఎగురవేసిన జావో.. స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సాధించింది. కాగా.. పారాలింపిక్స్ చ‌రిత్ర‌లోనే టేబుల్ టెన్నిస్‌లో భార‌త్‌కు ఇదే తొలి ప‌త‌కం కావ‌డం విశేషం.

భవీనా స్వస్థలం గుజరాత్‌లోని వాద్‌నగర్‌. ఆమె 12 నెలలో వయసులోనే పోలియోబారిన పడ‌డంతో చ‌క్రాల కుర్చీకే ప‌రిమితం అయ్యింది. కోచ్‌ లలన్ ఆధ్వర్యంలో భవీనా టేబుల్ టెన్నిస్‌ నేర్చుకుంది. భవీనా గుజరాత్‌ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. భవీనా బెన్‌ పటేల్ కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. భవీనాబెన్‌ పటెల్ దేశంలోని క్రీడాకారుల్లో, క్రీడాభిమానుల్లో స్ఫూర్తిని నింపింద‌ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప్ర‌శంసించారు. ఆమె నిబద్ధ‌త, నైపుణ్యాల వ‌ల్ల దేశానికి మంచి పేరు వ‌చ్చింద‌ని చెప్పారు. ఇటువంటి గొప్ప విజ‌యాన్ని సాధించిన ఆమెకు అభినంద‌న‌లు తెలుపుతున్నాన‌ని ట్వీట్ చేశారు.

భ‌వీనా ప‌టేల్ ను ప్రధాని మోదీ కూడా అభినందించారు. ఆమె చ‌రిత్ర లిఖించింద‌ని, ఆమె జీవితం చాలా మందికి స్ఫూర్తివంత‌మైంద‌ని చెప్పారు. ఆమె జీవిన ప్ర‌యాణం దేశంలోని యువ‌త‌ను క్రీడ వైపున‌కు ఆక‌ర్షిస్తోంద‌ని తెలిపారు.


Next Story