ధోనీపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు.. ట్వీట్ వైర‌ల్‌

Telangana Minister KTR praises MS Dhoni.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022లో గురువారం రాత్రి ముంబై ఇండియ‌న్స్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2022 9:03 AM GMT
ధోనీపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు.. ట్వీట్ వైర‌ల్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022లో గురువారం రాత్రి ముంబై ఇండియ‌న్స్‌పై చెన్నై సూప‌ర్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆఖ‌రి ఓవ‌ర్‌లో విజ‌యానికి 17 ప‌రుగులు అవ‌స‌ర‌మైన వేళ‌.. మ‌హేంద్రుడు బ్యాట్‌లో మాయాజాలం చేశాడు. మునుప‌టి ధోని ని గుర్తుకు తెస్తూ.. వ‌రుస‌గా 6, 4, 2, 4 బాది చెన్నైకు అద్భుత‌మైన విజ‌యాన్ని అందించాడు. దీంతో త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌కులకు త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పాడు మ‌హేంద్రుడు.

ఇక ధోని ఆడిన ఇన్నింగ్స్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ధోని ఆట‌గురించే అంతా చ‌ర్చిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో ధోనిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. 'వాస్త‌వానికి వ‌య‌సు అనేది ఒక అంకె మాత్ర‌మే. ధోనీ ఓ ఛాంపియ‌న్.. అసాధార‌ణ ఫినిష‌ర్.. ఓ లెజెండ్' అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. హైద‌రాబాద్ కుర్రాడు తిలక్‌ వర్మ (51 నాటౌట్‌; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోర‌ర్‌. సూర్యకుమార్‌ యాదవ్‌ (32; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌), అరంగేట్ర ఆటగాడు హృతిక్‌ షోకీన్‌ (25) ఫ‌ర్వాలేద‌నిపించ‌గా..రోహిత్‌ శర్మ (0), ఇషాన్‌ కిషన్‌ (0), బ్రేవిస్‌ (4), పొలార్డ్‌(14) లు దారుణంగా విఫ‌లం అయ్యారు.అనంతరం.. మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని( 28 నాటౌట్‌; 13 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) తో పాటు అంబ‌టి రాయుడు (40; 35 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాబిన్‌ ఊతప్ప (30; 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించ‌డంతో చెన్నై ల‌క్ష్యాన్ని 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి అందుకుంది.

Next Story