బుమ్రా పాంచ్ ప‌టాకా.. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 109 ఆలౌట్

Sri Lanka all out for 109 runs in Pink Ball Test.చిన్న‌స్వామి వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు తొలి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2022 9:42 AM GMT
బుమ్రా పాంచ్ ప‌టాకా.. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 109 ఆలౌట్

చిన్న‌స్వామి వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక త‌క్కువ స్కోరుకే ప‌రిమిత‌మైంది. స్టార్ పేస‌ర్, వైస్ కెప్టెన్ జ‌స్‌ప్రీత్ బుమ్రా చెల‌రేగ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో లంక 109 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో భార‌త్‌కు 143 ప‌రుగుల కీల‌క ఆధిక్యం ల‌భించింది. భార‌త బౌల‌ర్లలో బుమ్రా ఐదు వికెట్లు తీయ‌గా.. ష‌మీ, అశ్విన్ చెరో రెండు వికెట్లు, అక్ష‌ర్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

86/6 ఓవ‌ర్‌నైట్ స్కోర్‌తో ఆదివారం రెండో రోజు ఆట ప్రారంభించిన లంక మ‌రో 23 ప‌రుగులు మాత్ర‌మే జోడించి మిగిలిన వికెట్ల‌ను కోల్పోయింది. లంక బ్యాట‌ర్ల‌లో సీనియ‌ర్ ఆట‌గాడు ఏంజిలో మాథ్యూస్‌(43) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. నిరోష‌న్ డిక్వెల్లా(21), ధ‌నుంజ‌య డిసిల్వా(10) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించ‌గా.. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు.

ఇక భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 252 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త బ్యాట‌ర్ల‌లో శ్రేయాస్ అయ్యర్‌(92) అర్థ‌శ‌త‌కంతో రాణించ‌గా.. రిష‌బ్ పంత్ (39), హ‌నుమ విహ‌రి(31), విరాట్ కోహ్లీ(23) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. మిగిలిన వారిలో రోహిత్ శ‌ర్మ 15, మ‌యాంక్ అగ‌ర్వాల్ 4, జ‌డేజా 4, అశ్విన్ 13, అక్ష‌ర్ 9, ష‌మీ 5 ప‌రుగులు చేశారు.

Next Story