ధోనిని ఎంతగానో మిస్ అవుతున్నా.. ఆడించకపోవడం మరింత బాధించింది..!

Kuldeep Yadav about MS Dhoni. తాజాగా కుల్దీప్ యాదవ్ మహేంద్ర సింగ్ ధోనిని మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు.

By Medi Samrat  Published on  12 May 2021 7:33 AM GMT
MS Dhoni

కుల్దీప్ యాదవ్.. ఈ చైనామన్ బౌలర్ మొదట్లో అద్భుతంగా బౌలింగ్ చేసేవాడు. కానీ ఇటీవలి కాలంలో మునుపటి ప్రదర్శన ఇవ్వలేకపోతూ ఉన్నాడు. ఒకప్పుడు కుల్దీప్ యాదవ్-చాహల్ కలిసి స్పిన్ మాయాజాలంతో వరుసగా వికెట్లు తీస్తూ.. జట్టులో స్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. కానీ కుల్దీప్ కు ఇటీవలి కాలంలో అవకాశాలు కూడా తక్కువ అయ్యాయి. నిలకడైన బౌలింగ్ కూడా వేయలేకపోతూ ఉన్నాడు. ధోని వికెట్ కీపర్ గా ఉన్న సమయంలో అతడి సూచనలతో ఎంతో మంచిగా బౌలింగ్ వేసేవాడు కుల్దీప్. ఇప్పుడు అంతగొప్ప సహకారం అందడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. తాజాగా కుల్దీప్ యాదవ్ మహేంద్ర సింగ్ ధోనిని మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు.

'మహేంద్ర సింగ్ ధోని గైడెన్స్ ను మిస్ అవుతూ ఉంటాను. వికెట్ల వెనుక ధోని ఉండి ఇచ్చే సూచనలు.. ఎప్పుడైనా తప్పు చేస్తే అరుపుల కారణంగా తాను ఎంతో బాగా వేసేవాడిని. ఇప్పుడు రిషబ్ పంత్ వికెట్ల వెనుక ఉన్నాడు.. భవిష్యత్తులో అతడు కూడా మరిన్ని సూచనలు ఇచ్చే స్థాయికి ఎదుగుతాడు. కీపర్ బౌలర్ మధ్య కమ్యూనికేషన్ కారణంగా కూడా చాలా అవసరం.' అని తెలిపాడు కుల్దీప్. ధోని భారత జట్టులో ఉన్న సమయంలో నేను చాహల్ కలిసి బౌలింగ్ వేస్తూ ఉండే వాళ్ళము. ధోని జట్టు నుండి వెళ్ళిపోయాక.. నేను చాహల్ కలిసి చాలా తక్కువ మ్యాచ్ లు ఆడాము. ఓవరాల్ గా నేను మంచి ప్రదర్శనే ఇచ్చాను. కొన్ని సార్లు విఫలమైనప్పటికీ.. మరికొన్ని సార్లు పుంజుకున్నా అని కుల్దీప్ తెలిపాడు.

ఇక ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లలో తనను పక్కన పెట్టినప్పుడు చాలా బాధపడ్డానని కుల్దీప్ తెలిపాడు. కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం తనను పక్కన పెట్టినప్పుడు చాలా బాధేసిందని.. చెన్నై పిచ్ స్పిన్ అనుకూలించినప్పటికీ తనను పక్కన పెట్టడం చాలా బాధించిందని అన్నాడు. ఇది తనకు షాకింగ్ గా అనిపించడమే కాకుండా చాలా బాధగా కూడా అనిపించిందని కుల్దీప్ బాధను వ్యక్త పరిచాడు. ఓ వైపు బయో బబుల్.. మరో వైపు జట్టులో చోటు దక్కకపోవడం అన్నవి చాలా బాధను మిగిల్చే అంశాలని కుల్దీప్ యాదవ్ చెప్పాడు.


Next Story