బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ క్రికెట్ జట్టు ఓనర్ అయ్యాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) లో భాగంగా సల్మాన్ ఖాన్ న్యూఢిల్లీ ఫ్రాంచైజీ యజమానులలో ఒకరిగా నిలిచారు. ISPL కమీషనర్ సూరజ్ సమత్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ లీగ్ లో పలువురు సాధారణ క్రీడాకారులు కూడా సత్తా చాటుతూ ఉన్నారు. ISPL టెన్నిస్ బాల్తో జరిగే టీ10 టోర్నమెంట్. ఈ టోర్నీని 2024లో ప్రారంభించారు. దేశం నలుమూలల్లో ఉండే క్రికెటర్లలో ప్రతిభను గుర్తించి, ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలన్న ఆలోచనతో ఈ లీగ్ పుట్టింది. ఈ లీగ్ కోసం ఆటగాళ్లను ఐపీఎల్ వేలం తరహాలో ఎంపిక చేసుకుంటారు.
ISPLలో ఇదివరకే పలువురు సినీ ప్రముఖులు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. అమితాబ్ బచ్చన్ (మాఝీ ముంబై), సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ (టైగర్స్ ఆఫ్ కోల్కతా), అక్షయ్ కుమార్ (శ్రీనగర్ కే వీర్), తమిళ నటుడు సూర్య (చెన్నై సింగమ్స్), హృతిక్ రోషన్ (బెంగళూరు స్ట్రైకర్స్), మెగా పవర్స్టార్ రామ్ చరణ్ (ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్) సంబంధిత ఫ్రాంచైజీలకు ఓనర్లుగా ఉన్నారు.