తొలి టెస్టులో ఓట‌మిపై బాధ‌ను వ్య‌క్తం చేసిన పంత్

భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ హెడింగ్లీ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు.

By Medi Samrat
Published on : 25 Jun 2025 5:20 PM IST

తొలి టెస్టులో ఓట‌మిపై బాధ‌ను వ్య‌క్తం చేసిన పంత్

భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ హెడింగ్లీ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు. టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించిన తొలి భారత వికెట్‌కీపర్‌గా పంత్ నిలిచాడు. అయితే పంత్ సెంచరీ ఇన్నింగ్స్ కూడా భారత్ ఓటమిని నివారించలేకపోయింది. 371 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించిన ఇంగ్లండ్ తొలి టెస్టులో భారత్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుత సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉండగా.. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది.

హెడ్డింగ్లీ టెస్టులో ఓటమి తర్వాత రిషబ్ పంత్ తొలిసారి సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. పంత్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఇలా పోస్ట్ చేశాడు. ఇది కొంత కాలం పాటు మాన‌సికంగా మమ్మల్ని బాధిస్తుంది, కానీ మేము బలమైన పునరాగమనంతో వ‌స్తామ‌ని నమ్మకంతో ఉన్నామని త‌న బాధ‌ను వ్య‌క్తం చేశాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. పంత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 134 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ 118 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. త‌ద్వారా టెస్టు చరిత్రలో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించిన రెండో వికెట్‌కీపర్‌గా పంత్ నిలిచాడు.

హెడింగ్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులు చేయ‌గా.. దానికి సమాధానంగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భార‌త్‌కు 6 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయ్యి ఇంగ్లండ్‌కు 371 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఆతిథ్య జట్టు ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Next Story