పంత్ రనౌట్ కొంపముంచిందేమో..!

Rishabh Pant run out after terrible mix-up with Virat Kohli. మూడో టీ20లో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. 157 పరుగుల

By Medi Samrat  Published on  17 March 2021 9:12 AM GMT
Rishabh Pant run out after terrible mix-up with Virat Kohli

మూడో టీ20లో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. 157 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఎంతో సునాయాసంగా చేధించింది. ఓపెనర్ జోస్ బట్లర్ (83 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సులు) దూకుడుగా ఆడడంతో ఇంగ్లండ్ కేవలం 2 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. జానీ బెయిర్ స్టో (40 నాటౌట్; 5 ఫోర్లు) కూడా ధాటిగా ఆడాడు. టీమిండియా బౌలర్లలో చహల్, సుందర్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ జాసన్ రాయ్ 9 పరుగులు చేయగా, డేవిడ్ మలాన్ 18 పరుగులకు అవుటయ్యాడు.

టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఇంగ్లండ్ బౌలర్లు రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోహ్లీ 46 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పంత్ (25), పాండ్య (17) ఫర్వాలేదనిపించారు.రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో బరిలో దిగి 15 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ మరోమారు డకౌట్ అయ్యాడు, ఇషాన్ కిషన్ 4 పరుగులు మాత్రమే చేశాడు. మార్క్ ఉడ్ 3, క్రిస్ జోర్డాన్ 2 వికెట్లు తీశారు.

భారత్ ఇన్నింగ్స్ లో ఆదిలోనే మూడు వికెట్లు పోయాయి. కోహ్లీ, పంత్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డ సమయంలో ఓ తప్పిదం భారత స్కోరు బోర్డుపై తీవ్ర ప్రభావం చూపింది. అదే పంత్ రనౌట్..! సామ్‌ కరస్‌ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ తొలి బంతిని పంత్‌ కవర్స్ దిశగా కొట్టి డబుల్ పూర్తి చేశాడు. ఫీల్డర్ మార్క్ వుడ్ బంతిని త్రో వేయగా.. దానిని అందుకున్న బట్లర్‌ వెనుకనుంచి విసరడంతో వికెట్లను తాకకుండా పక్కకు వెళ్లిపోయింది. నాన్‌ స్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న కోహ్లీ పిలుపు అందుకొని ఏం ఆలోచించకుండా పంత్‌ క్రీజు దాటి సగం దూరం వచ్చేశాడు. కోహ్లీ అవతలి ఎండ్‌కు చేరుకోగా.. పంత్‌ మాత్రం వేగంగా చేరుకోలేకపోయాడు. బట్లర్‌ వేగంగా స్పందించి సామ్‌ కరన్‌వైపు బంతిని త్రో వేయగా.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కరణ్ వికెట్ ను తీశాడు. పంత్‌ డైవ్‌ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాస్తవానికి 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన పంత్‌ కోహ్లితో కలిసి మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇద్దరి మధ్య 40 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదైంది. మూడో పరుగు కోసం పంత్‌ పరిగెత్తకపోయి ఉంటే భారత్ స్కోరు ఇంకాస్త ఎక్కువే ఉండేదేమో అని పలువురు క్రీడా విశ్లేషకులు చెప్పుకొచ్చారు.




Next Story