టీమిండియా హెడ్ కోచ్ పదవిపై రికీ పాంటింగ్ ఆసక్తికర కామెంట్స్
ఇప్పటికే బీసీసీఐ టీమిండియా మెన్స్ హెడ్ కోచ్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది.
By Srikanth Gundamalla Published on 23 May 2024 8:30 PM IST
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై రికీ పాంటింగ్ ఆసక్తికర కామెంట్స్
ఇప్పటికే బీసీసీఐ టీమిండియా మెన్స్ హెడ్ కోచ్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ క్రమంలో ఈ పదవిని చేపట్టేందుకు అర్హులంటూ కొందరి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే స్టీఫెన్ ప్లెమింగ్, జస్టిన్ లాంగర్, గౌతమ్ గంభీర్, సేహ్వాగ్ ఇలా చాలా మంది పేర్లు వైరల్ అవుతున్నాయి. కానీ.. ఎవరూ ఇప్పటి దాకా మేం సిద్ధం టీమిండియా హెడ్ కోచ్ పదవిని చేపట్టేందుకు అని ప్రకటించలేదు. అంతేకాదు.. మరో నాలుగు రోజులు మాత్రమే టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తుల స్వీకరణ సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో.. బీసీసీఐ దరఖాస్తుల దారులను కూడా ప్రకటించలేదు.
కాగా.. ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్.. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ కూడా ఈ పదవి చేపడతారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై రికీపాంటింగ్ స్పందించారు. తాను టీమిండియా హెచ్ కోచ్ పదవిని తీసుకునేందుకు రెడీగా లేనని చెప్పారు. దీనికి కారణాలను కూడా ఆయన వెల్లడించారు.
భారత ప్రధాన కోచ్ పదవి అత్యంత క్లిష్టమైనదని రికీ పాంటింగ్ పేర్కొన్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత కోచ్పై భారీ అంచనాలు పెట్టుకుంటారనీ.. ఇప్పుడు ఆ పని చేసేందుకు తాను సిద్ధంగా లేనన్నాడు. అంతేకాదు.. తప్పకుండా భవిష్యత్లో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోలేదని కూడా తెలిపారు. సీనియర్ జాతీయ జట్టు బాధ్యతలు చేపట్టడం గౌరవంగా భావిస్తానని.. కాని ఇప్పుడు మాత్రం అందుకు రెడీగా లేనని రికీ పాంటింగ్ అన్నారు. కుటుంబం కోసం సమయం వెచ్చించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇక భారత కోచ్ దాదాపు పది నెలలపాటు విధుల్లోనే ఉండాలనీ.. ఐపీఎల్తో సంబంధం ఉండొద్దని రికీ పాంటింగ్ అన్నారు.
ప్రస్తుతం లైఫ్ను ఆస్వాదిస్తున్టన్లు పేర్కొన్నారు. టీమిండియా హెడ్ కోచ్గా అవకాశం వస్తే వదులుకోవద్దని తన కుమారుడు చెప్పాడనీ.. కానీ దానికి సరిపోయేలా జీవనశైలి లేదని కచ్చితంగా చెప్తానని రికీ పాంటింగ్ అన్నారు. ఇక భవిష్యత్లో ఏమవుతుందనే చూడాలని అన్నారు. కాగా.. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. ఆయన పదవీకాలం జూన్ చివరితో ముగియనుంది. కొత్తగా వచ్చే కోచ్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు జట్టును నడిపించాల్సి ఉంటుంది.