ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2023 సీజన్ ప్రారంభం కావడానికి ముందే కోల్కతా నైట్రైడర్స్కు ఆస్ట్రేలియా టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ షాకిచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్ తాను ఆడటం లేదని అతడు ప్రకటించాడు. మంగళవారం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అతడు వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో బిజీ షెడ్యూలే అందుకు కారణం అని అతడు చెప్పాడు. తన నిర్ణయాన్ని ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా కు చెప్పడం జరిగిందని, అందుకు కోల్కతా కూడా అంగీకరించిందని అతడు తెలిపాడు.
"ఇది చాలా కఠిన నిర్ణయం. వచ్చే ఏడాది ఐపీఎల్ టోర్నీ మిస్ అవుతున్నా. ఇందుకు బాధగా ఉంది. అయితే..రానున్న 12 నెలలు వన్డేలు, టెస్టులతో షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. వన్డే ప్రపంచకప్, యాషెస్ సిరీస్లకు ముందు కొంత విశ్రాంతి కావాలని అనుకుంటున్నా. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా" అని కమిన్స్ ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2023 సీజన్ కోసం పది ప్రాంఛైజీలు తమ వద్ద అట్టిపెట్టుకునే, వదులుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించడానికి మంగళవారం(నవంబర్ 15) చివరి రోజు కావడంతోనే కమిన్స్ తన నిర్ణయాన్ని తెలిపినట్లు తెలుస్తోంది.