ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంట తీవ్ర‌విషాదం

ఆస్ట్రేలియా జ‌ట్టు టెస్టు కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ త‌ల్లి మరియా శుక్ర‌వారం తెల్ల‌వారుజామున క‌న్నుమూసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 March 2023 6:42 AM GMT
Pat Cummins, Maria,

ప్యాట్ కమిన్స్

ఆస్ట్రేలియా జ‌ట్టు టెస్టు కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న త‌ల్లి మరియా కమిన్స్ మ‌ర‌ణించింది. గ‌త కొంత‌కాలంగా క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారితో పోరాటం చేస్తున్న ఆమె శుక్ర‌వారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచింది. ఈ విష‌యాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీక‌రించింది.

'మరియా కమిన్స్ మరణవార్త తెలిసి మేం చాలా బాధపడుతున్నాం. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరఫున ప్యాట్ కమిన్స్‌, అతని కుటుంబం, స్నేహితులకు మా సంతాపం తెలుపుతున్నాం. మరియా గౌరవార్ధం ఈ రోజు ఆస్ట్రేలియా జట్టు నల్లటి రిబ్బ‌న్ల‌తో బరిలో దిగుతుంది' అని క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది.

భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కూడా మరియా మరణంపై స్పందించింది. 'భారత క్రికెట్ తరఫున మరియా మరణంపై చాలా బాధ పడుతున్నాం. ఈ కష్టకాలంలో ప్యాట్, అతని కుటుంబానికి మా సానుభూతి ఉంటుంది' అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

త‌న త‌ల్లి అనారోగ్యం కార‌ణంగా బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో రెండో టెస్టు ముగియ‌గానే ప్యాట్ క‌మిన్స్ స్వ‌దేశానికి వెళ్లిపోయాడు. దీంతో మూడో టెస్టులో ఆడ‌లేదు. నాలుగో టెస్టుకి అందుబాటులో ఉంటాడ‌ని బావించారు. అయితే.. త‌ల్లి ప‌రిస్థితి మ‌రింత విష‌మంగా ఉండ‌డంతో నాలుగో టెస్టుకు కూడా క‌మిన్స్ రాలేదు. అత‌డి స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు.

Next Story