ముంబై ఇండియన్స్‌కు కొత్త బౌలింగ్ కోచ్‌.. టీమిండియా ప్రపంచ కప్ గెలిచింది ఆయ‌న శిక్ష‌ణ‌లోనే..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కి ముందు పరాస్ మాంబ్రేని ముంబై ఇండియన్స్ తమ బౌలింగ్ కోచ్‌గా నియమించింది

By Medi Samrat  Published on  16 Oct 2024 10:29 AM GMT
ముంబై ఇండియన్స్‌కు కొత్త బౌలింగ్ కోచ్‌.. టీమిండియా ప్రపంచ కప్ గెలిచింది ఆయ‌న శిక్ష‌ణ‌లోనే..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కి ముందు పరాస్ మాంబ్రేని ముంబై ఇండియన్స్ తమ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. పరాస్ ప్రస్తుత బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతో కలిసి పని చేయనున్నాడు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. కొంతకాలం క్రితం ముంబై ఇండియన్స్ మహేల జయవర్ధన్‌కు ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించింది. తాజాగా బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే నియామకాన్ని ముంబై ఇండియన్స్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే ఆధ్వర్యంలో కోచింగ్ టీమ్‌లో భాగమైన పరాస్.. బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతో కలిసి పని చేస్తాడు.

మాంబ్రే బౌలింగ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే టీమిండియా T20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. పరాస్ మాంబ్రే గతంలో ముంబై ఇండియన్స్ కోచింగ్ టీమ్‌లో ప‌నిచేశాడు. మాంబ్రే గ‌తంలో నాలుగు సంవత్సరాలు ముంబై జట్టు కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ ముంబై జట్టులోకి వచ్చి ఈ బాధ్యతను స్వీకరించాడు. ఈ ఏడాది చివర్లో జరగనున్న మెగా వేలంలో మాంబ్రే కూడా పాల్గొంటాడు. గత 12 సంవత్సరాలుగా మాంబ్రే మహారాష్ట్ర, బెంగాల్, బరోడా, విదర్భలకు కోచ్‌గా ఉన్నాడు.

పరాస్ మాంబ్రే 1996లో ఇంగ్లండ్ పర్యటనలో భారత్ తరఫున 2 టెస్టులు, 3 వ‌న్డే మ్యాచ్‌లు ఆడాడు. రెండు టెస్టుల్లో రెండు వికెట్లు, మూడు వన్డేలలో మూడు వికెట్లు తీశాడు. ముంబై తరఫున 91 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది. రోహిత్ శర్మ నుండి కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్ప‌గించారు. హార్దిక్‌ను కెప్టెన్‌గా చేయడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. IPL 2024లో ముంబై జట్టు 10 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలవగలిగింది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్‌కు కూడా అర్హత సాధించలేదు.

Next Story