'పాకిస్తాన్ సూపర్ లీగ్ కాదు'.. 'పెట్రోల్‌ షార్టేజ్ లీగ్‌'.. పీసీబీపై తీవ్ర విమర్శలు

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 మార్చి 26న ప్రారంభం కానుంది. అయితే అది మొదలవక ముందే లీగ్‌పై సంక్షోభపు చీకటి మేఘాలు కమ్ముకున్నాయి.

By -  Medi Samrat
Published on : 23 March 2026 11:23 AM IST

పాకిస్తాన్ సూపర్ లీగ్ కాదు.. పెట్రోల్‌ షార్టేజ్ లీగ్‌.. పీసీబీపై తీవ్ర విమర్శలు

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 మార్చి 26న ప్రారంభం కానుంది. అయితే అది మొదలవక ముందే లీగ్‌పై సంక్షోభపు చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ తీసుకున్న అనేక దిగ్భ్రాంతికరమైన మార్పులు లీగ్ కళను మసకబార్చాయి. ఈ నిర్ణయాల తరువాత.. సోషల్ మీడియాలో పీసీబీ తీవ్ర విమర్శలకు గురవుతోంది.

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ఈ టోర్నమెంట్ నేరుగా ప్రభావితం కానుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల ఆసియా అంతటా తీవ్రమైన ఇంధన కొరత ఏర్పడింది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంతో సతమతమవుతోంది, దీంతో ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించవలసి వచ్చింది. మొత్తం పీఎస్ఎల్ టోర్నమెంట్ ఇప్పుడు ప్రేక్షకులు లేకుండా జరుగుతుంది.

ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు పీఎస్ఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు లాహోర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ స్పష్టం చేశారు.

నఖ్వీ ప్రకారం, "ఇంధన సంక్షోభం దృష్ట్యా పాఠశాలలను మూసివేశారు, ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఈద్ సెలవులను కూడా పొడిగించారు. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో ఎటువంటి హామీ లేదు. భద్రతా సంస్థలతో సుదీర్ఘ చర్చల అనంతరం, లీగ్‌ను రద్దు చేయకుండా ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ విష‌య‌మై 'ఐస్‌లాండ్ క్రికెట్‌' ట్విట్టర్‌లో పెట్టిన ఒక పోస్ట్ తక్షణమే వైరల్ అయింది. పీఎస్ఎల్ వస్తోంది, ఇది లక్షలాది మంది అభిమానులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పీఎస్ఎల్ అంటే ఏమిటో అని మేము ఎప్పుడూ ఆశ్చర్యపోయేవాళ్ళం, ఇప్పుడు అది 'పెట్రోల్ షార్టేజ్‌ లీగ్' అని మాకు తెలిసింది. ఈ పోస్ట్ తర్వాత సోషల్ మీడియాలో #PetrolShortageLeague ట్రెండింగ్ అవ్వడం మొదలైంది. అభిమానులు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి పీసీబీని విమర్శించారు.

కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు మరో వాదన చేశారు. అసలు కారణం కేవలం పెట్రోల్ కొరత మాత్రమే కాదని, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతే భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఆంక్షలకు దారితీసిందని వారు పేర్కొన్నారు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్, దేశ హోం మంత్రి మోసిన్ నఖ్వీ.. లాహోర్‌లో జరిగిన ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించాలనే నిర్ణయం తమ ఇష్టంతో తీసుకున్నది కాదని, ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చేసిన ప్రత్యక్ష విజ్ఞప్తి ఆధారంగా తీసుకున్న తప్పనిసరి పరిస్థితి అని స్పష్టం చేశారు. ఈ సమయంలో వనరులు అత్యంత విలువైనవని, వాటిని అనవసరమైన ఖర్చులపై దుర్వినియోగం చేయలేమని నఖ్వీ వివరించారు.

మొదట ఆరు నగరాల్లో నిర్వహించాలని నిర్ణయించిన ఈ టోర్నమెంట్‌ను ఇప్పుడు లాహోర్, కరాచీ రెండు నగరాలకే పరిమితం చేశారు. వనరులను మెరుగ్గా నిర్వహించడానికి, జట్లు, సిబ్బంది ప్రయాణాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పెషావర్ లోని క్రికెట్ అభిమానులపై అత్యధిక ప్రభావాన్ని చూపింది.

పెషావర్ లో తొలి పీఎస్ఎల్ మ్యాచ్ మార్చి 28న జరగాల్సి ఉండగా.. అక్కడి అభిమానులు దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు, ఆతిథ్య హక్కులను కోల్పోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం "కష్టమైన నిర్ణయం" అని పేర్కొంటూ.. మోసిన్ నఖ్వీ క్షమాపణలు చెప్పారు.

Next Story