ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ..!

ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువ బౌలర్ విఘ్నేష్ పుత్తూర్ గాయం కారణంగా మిగిలిన సీజన్‌కు దూరమ‌య్యాడు.

By Medi Samrat
Published on : 1 May 2025 2:43 PM IST

ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ..!

ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువ బౌలర్ విఘ్నేష్ పుత్తూర్ గాయం కారణంగా మిగిలిన సీజన్‌కు దూరమ‌య్యాడు. ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్‌మెంట్ విఘ్నేష్ స్థానంలో పంజాబ్‌కు చెందిన రఘు శర్మను జట్టులోకి తీసుకుంది.

31 ఏళ్ల లెగ్ స్పిన్నర్ రఘు శర్మ దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ మరియు పుదుచ్చేరికి ప్రాతినిధ్యం వహించాడు. రఘు ఫస్ట్ క్లాస్ రికార్డు చూస్తే.. 11 మ్యాచ్‌ల్లో 19.59 సగటుతో 57 వికెట్లు తీశాడు. 56 పరుగులకు ఏడు వికెట్లు అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.

రఘు 9 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 14 వికెట్లు, మూడు టీ20 మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో రఘు శర్మకు ఇదే తొలి అవకాశం. అతడు తన ప్రాథమిక ధర రూ. 30 లక్షలకు ముంబై ఇండియన్స్‌లో చేరాడు.

ఇక గాయపడిన విఘ్నేష్ పుత్తూర్ టోర్నమెంట్‌లో తనదైన ముద్ర వేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ తరఫున విఘ్నేష్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో విఘ్నేష్ 5 మ్యాచ్‌లు ఆడగా, అందులో మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు.

ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ వైపు అడుగులు వేస్తుంది. తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసిన ముంబై.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఆరోసారి ఐపీఎల్ టైటిల్‌ను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.

Next Story