ప్రణయ్‌ ని ఓడించిన లక్ష్య సేన్

22 ఏళ్ల లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ ఈవెంట్ పోటీలో.. భారతదేశానికే చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ఓడించాడు.

By Medi Samrat  Published on  1 Aug 2024 2:00 PM GMT
ప్రణయ్‌ ని ఓడించిన లక్ష్య సేన్

22 ఏళ్ల లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ ఈవెంట్ పోటీలో.. భారతదేశానికే చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ఓడించాడు. ఆగస్టు 1వ తేదీ గురువారం వరుస గేమ్‌లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు లక్ష్య సేన్ అర్హత సాధించాడు. లక్ష్య 39 నిమిషాల్లో ప్రణయ్‌పై 21-12, 21-6తో విజయం సాధించి.. తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించాడు. ప్రణయ్ ఈ మ్యాచ్‌లో అలసిపోయి కనిపించాడు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాడు.

లక్ష్య మరియు హెచ్‌ఎస్ ప్రణయ్ ఇద్దరూ బాగా తెలిసిన వాళ్ళే కావడంతో.. మ్యాచ్ నెమ్మదిగా ప్రారంభమైంది. ప్రారంభ గేమ్ మొదటి అర్ధభాగం 47-షాట్ల సుదీర్ఘ ర్యాలీని కలిగి ఉంది. మ్యాచ్ ప్రారంభంలో 1-5తో వెనుకబడిన ప్రణయ్ ఎక్కడా కూడా లక్ష్య సేన్ కు అడ్డుగా నిలవలేకపోయాడు. ప్రణయ్ చేసిన అనవసర తప్పిదాలతో మొదటి గేమ్‌ను 21-12తో కోల్పోయాడు. రెండో గేమ్‌లో కూడా ప్రణయ్ ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. తన జీవితంలో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న లక్ష్య సేన్ రెండో గేమ్ ను కూడా 21-06తో సొంతం చేసుకున్నాడు.

క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్‌తో లక్ష్య తలపడనున్నాడు. 34 ఏళ్ల వెటరన్‌తో లక్ష్య నాలుగుసార్లు తలపడగా ఒక్కసారి మాత్రమే లక్ష్య విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వీరిద్దరూ చివరిసారిగా సింగపూర్ ఓపెన్ 2023లో తలపడ్డారు. ఇక్కడ 3-గేమ్‌ల పోరులో లక్ష్యను చౌ టియెన్ చెన్‌ ఓడించాడు.

Next Story