కీలక నిర్ణయాలు తీసుకున్న కోహ్లీ, ధోని

Key Decisions by taken Kohli and Dhoni.ధోని.. ప్రతి ఒక్క ఆటగాడు సొంత దేశానికి ప్రయాణం అయ్యే వరకూ తాను బయోబబుల్ ను దాటను అని చెప్పాడట. కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి కరోనా బాధితులను ఆదుకోడానికి సిద్ధమయ్యాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2021 1:15 PM GMT
kohli,dhoni

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే..! ఇక విదేశాలకు చెందిన ఆటగాళ్లను వారి వారి సొంత ఊళ్లకు పంపించడానికి ఫ్రాంచైజీలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ దేశాలకు వెళ్లిపోగా.. ఆసీస్ ఆటగాళ్లు మాల్దీవ్స్‌కు వెళ్లి.. అక్క‌డి నుంచి కొద్దిరోజుల తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశం ఉంది. ఇంకొన్ని ఫ్రాంచైజీలు చార్టర్డ్ ఫ్లైట్స్ వేసి పంపించాలని చూస్తూ ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ప్రతి ఒక్క ఆటగాడు సొంత దేశానికి ప్రయాణం అయ్యే వరకూ తాను బయోబబుల్ ను దాటను అని చెప్పాడట.

ప్ర‌తి ఒక్క‌రూ సుర‌క్షితంగా ఇంటికి వెళ్లిన త‌ర్వాతే తాను ఇంటికి వెళ్తాన‌ని, క్యాంప్ నుంచి ఇంటికి వెళ్లే ఆఖ‌రి వ్య‌క్తి తానే అవుతాన‌ని ధోనీ చెప్పాడు. చెప్పిన‌ట్లే ప్రతి ఒక్క‌రూ సుర‌క్షితంగా ఇంటికి చేరారా లేదా అన్న‌ది ఆరా తీస్తున్నాడు. ముందు విదేశీ ప్లేయ‌ర్స్ వెళ్లాల‌ని, త‌ర్వాత దేశీయ ఆట‌గాళ్లు వెళ్లాల‌ని ఓ వీడియో చాట్‌లో ధోనీ చెప్పాడు. చివ‌ర‌గా తాను వెళ్తాన‌ని ధోనీ అన్న‌ట్లు తెలుస్తోంది. ధోని మరోసారి తాను ఎంతో స్పెషల్ అని నిరూపించుకున్నాడు.

ముంబై ఇండియ‌న్స్ జట్టు త‌మ విదేశీ ప్లేయ‌ర్స్ అంద‌రినీ చార్ట‌ర్డ్ విమానాల్లో పంపిస్తోంది. విదేశీ ప్లేయ‌ర్స్‌కు ప్ర‌త్యేక ఏర్పాటు చేసిన టీమ్ గా నిలిచింది. ఈ విమానాలు సౌతాఫ్రికా మీదుగా న్యూజిలాండ్‌, వెస్టిండీస్ వెళ్ల‌నున్నాయి. మిగ‌తా ఐపీఎల్ టీమ్స్‌లో ఉన్న ప్లేయ‌ర్స్‌ను కూడా తీసుకెళ్తామ‌ని ముంబై టీమ్ చెప్పింది.

ఇక భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి కరోనా బాధితులను ఆదుకోడానికి సిద్ధమయ్యాడు. ఐపీఎల్ వాయిదా ప‌డ‌టంతో వెంట‌నే కొవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాలు పంచుకుంటూ ఉన్నాడు కోహ్లీ. అహ్మ‌దాబాద్ నుంచి ముంబై వెళ్లిపోయిన కోహ్లి కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని యువ‌సేన స‌భ్యుడు రాహుల్ క‌నాల్ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. కోహ్లీ త‌మ‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాడ‌ని చెబుతూ ఫొటోల‌ను షేర్ చేశాడు. కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ కూడా కొవిడ్ స‌హాయక చ‌ర్య‌ల్లో పాలుపంచుకుంటోంది. తన పుట్టినరోజు నాడు కోవిడ్ బాధితులను ఆదుకోడానికి తాము చర్యలు తీసుకోబోతున్నామని అనుష్క శర్మ చెప్పిన సంగతి తెలిసిందే..!


Next Story