ముల్లన్‌పూర్‌లో వర్షం కురిసే అవకాశం..? ఒక‌వేళ వ‌రుణుడు అడ్డుకుంటే ఆ జ‌ట్టు ఇంటికే..

ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య శుక్రవారం ముల్లన్‌పూర్‌లో జరగనుంది.

By Medi Samrat
Published on : 30 May 2025 12:47 PM IST

ముల్లన్‌పూర్‌లో వర్షం కురిసే అవకాశం..? ఒక‌వేళ వ‌రుణుడు అడ్డుకుంటే ఆ జ‌ట్టు ఇంటికే..

ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య శుక్రవారం ముల్లన్‌పూర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌కు చేరుకోగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ గుజరాత్, ముంబై రెండింటికీ డూ ఆర్ డై కానుంది. కాగా.. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యద్వీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే.. అలాంటి పరిస్థితుల్లో గుజరాత్ జట్టు రెండో క్వాలిఫయర్‌కు చేరుకోగా.. ముంబై టోర్నీ నుంచి ఔట్ అవుతుంది.

లీగ్ దశలో పాయింట్ల పట్టిక ఆధారంగా ఇది జ‌రుగుతుంది. ఐపీఎల్ 2025 లీగ్ దశ ముగిసే సమయానికి గుజరాత్ టైటాన్స్ మూడో స్థానంలో ఉండగా.. ముంబై నాలుగో స్థానంలో ఉంది. మ్యాచ్ రద్దు అయినట్లయితే.. మెరుగైన ర్యాంక్ ఉన్న జట్టుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దిగువ ర్యాంక్ ఉన్న జట్టు నష్టాన్ని చవిచూడాలి.

వాతావరణ శాఖ ప్రకారం.. న్యూ చండీగఢ్‌లో ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని అంచనా. మ్యాచ్ జరిగే సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని భావిస్తున్నారు. మ్యాచ్ జరిగే సమయంలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని.. అయినా భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

గుజరాత్, ముంబై మధ్య జరిగే మ్యాచ్ వాతావరణం కారణంగా మ్యాచ్‌ రద్దైతే.. ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో నిలిచిన గుజరాత్‌ రెండో క్వాలిఫయర్‌కు చేరుకుంటుంది.

మ్యాచ్ గురించి మాట్లాడితే.. గుజరాత్, ముంబై రెండూ తమ విదేశీ ఆటగాళ్లను కోల్పోయాయి. ర్యాన్ రికిల్టన్, విల్ జాక్వెస్, కార్బిన్ బాష్ ముంబై నుండి స్వ‌దేశాల‌కు బయలుదేరారు. టైటాన్స్ నుంచి అనుభవజ్ఞుడైన జోస్ బట్లర్ సేవలను ఆ జ‌ట్టు కోల్పోనుంది. దీంతో రెండు జట్లు ప్లేయింగ్‌-11లో మార్పులు చేయాల్సి రావచ్చు.

ముంబై ఇండియన్స్ ఓపెనింగ్‌లో రికిల్టన్ స్థానంలో జానీ బెయిర్‌స్టోకు అవకాశం ఇవ్వనున్న‌ట్లు తెలుస్తుంది. విల్ జాక్వెస్ స్థానంలో చరిత్ అసలంకను భర్తీ చేయడం దాదాపు ఖాయం. అదే సమయంలో జోస్ బట్లర్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ కుశాల్ మెండిస్‌కు అవకాశం ఇవ్వనుంది.

రెండు జట్ల మధ్య హోరాహోరీ రికార్డును పరిశీలిస్తే.. ముంబై ఇండియన్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌దే పైచేయి. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 7 మ్యాచ్‌లు జరిగాయి. గుజరాత్ ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. ముంబై జట్టు కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో లీగ్ దశలో ఇరు జట్లు రెండుసార్లు తలపడగా.. రెండుసార్లు గుజరాత్ విజయం సాధించింది.

Next Story