ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం సందర్భంగా కరాచీలోని నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చర్య సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపిన కొద్ది రోజుల తర్వాత భారత త్రివర్ణ పతాకం కరాచీలోని జాతీయ స్టేడియంలో కనిపించింది. పాకిస్తాన్లో ICC టోర్నమెంట్ ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు, గడ్డాఫీ స్టేడియం వీడియో వైరల్ అవ్వడంతో వివాదం చెలరేగింది. భారతదేశం మినహా టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల జెండాలు ఉంచారు.
పాకిస్థాన్ లో నిర్వహించే ఈ టోర్నీకి భారత్ వెళ్ళలేదు. భారత్ గ్రూప్ మ్యాచ్ లను, ఒకవేళ క్వాలిఫై అయితే నాకౌట్ మ్యాచ్ లను దుబాయ్ లోనే ఆడనుంది. అయితే టోర్నమెంట్ కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారత త్రివర్ణ పతాకం మినహా మిగిలిన అన్ని జట్ల జెండాలను కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. దీన్ని భారత క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. కరాచీ స్టేడియంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. పాక్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పీసీబీ దిగొచ్చింది. స్టేడియంలో భారత పతాకాన్ని ప్రదర్శించింది.