టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్‌ జరగకపోతే..?

టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు సమయం వచ్చేసింది. శనివారం బార్బడోస్‌ వేదికగా ఈ తుది పోరు జరుగుతుంది.

By Srikanth Gundamalla
Published on : 29 Jun 2024 6:43 AM IST

india vs south africa, t20 world cup, final match, rain alert ,

టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్‌ జరగకపోతే..?

టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు సమయం వచ్చేసింది. శనివారం బార్బడోస్‌ వేదికగా ఈ తుది పోరు జరుగుతుంది. భారత్, సౌతాఫ్రికా టీమ్‌లు కప్‌ కోసం ఢీకొనబోతున్నాయి. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. బార్బడోస్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్యూ వెదర్ రిపోర్ట్‌ ప్రకారం.. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో 78 శాతం వర్షం పడే చాన్స్ ఉన్నట్లు వెల్లడించారు.

అక్కడ కాలమానం ప్రకారం.. మ్యాచ్‌ ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అవుతుంది. మ్యాచ్‌ జరిగే రోజు ఉదయం 3 గంటల నుంచే వర్షం పడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. దాంతో... ఇరు జట్లు ఆందోళన చెందుతున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు అయితే పరిస్థితి ఏంటంటూ క్రికెట్ అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. అయితే.. ఫైనల్‌ మ్యాచ్‌కు ఐసీసీ రిజర్వ్‌డే కేటాయించింది. శనివారం మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయితే.. ఆదివారం రోజున మళ్లీ మ్యాచ్‌ను జరిపిస్తారు. ఒక వేళ శనివారం మ్యాచ్‌ ప్రారంభం అయి మధ్యలో నిలిచిపోతే.. ఎక్కడైతే మ్యాచ్‌ నిలిచిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. రిజర్వ్‌డే రోజున కూడా మ్యాచ్‌ జరగకపోతే.. ఫలితం తేలకపోతే రెండు జట్లను విజేతలుగా ప్రకటించనుంది ఐసీసీ. దాంతో.. సౌతాఫ్రికా, ఇండియా జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటాయి. డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో నిర్ణయించాల్సి వస్తే ఇరు జట్లు కనీసం 10 ఓవర్ల చొప్పున అయినా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా, భారత్‌ జట్టు క్రికెట్ అభిమానులు వరుణుడు ఒక్కరోజు విరామం తీసుకుంటే బాగుండనీ అనుకుంటున్నారు.

Next Story