చుక్క‌లు చూపిస్తున్న భార‌త బౌల‌ర్లు.. ఏడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

భారత్-దక్షిణాఫ్రికా మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం అయ్యింది.

By Medi Samrat  Published on  17 Dec 2023 9:19 AM GMT
చుక్క‌లు చూపిస్తున్న భార‌త బౌల‌ర్లు.. ఏడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

భారత్-దక్షిణాఫ్రికా మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం అయ్యింది. జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో ఈరోజు తొలి మ్యాచ్ జరుగుతోంది. ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో డ్రాగా ముగిసింది. వన్డేల్లో కేఎల్ రాహుల్ టీమిండియా కెప్టెన్ కాగా.. దక్షిణాఫ్రికా జట్టుకు ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచిన మార్క్రామ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రింకూకు బదులుగా శాంసన్‌కు అవకాశం కల్పించారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా జట్టు 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆర్ష్‌దీప్ రెండో ఓవర్‌లో వరుసగా రెండు బంతుల్లో రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. అయితే హ్యాట్రిక్‌ మిస్సయ్యాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ ఎనిమిదో ఓవర్‌లో.. టోనీ డి జార్జి వికెట్ కీపర్ రాహుల్ చేతికి చిక్కాడు. దీని తర్వాత 10వ ఓవర్ చివరి బంతికి హెన్రిచ్ క్లాసెన్‌ను అర్ష్‌దీప్ బౌల్డ్ చేశాడు. అవేష్ ఖాన్ 11వ ఓవర్లో హ్యాట్రిక్ మిస్సయ్యాడు. తొలి రెండు బంతుల్లో ఐడెన్‌ మార్క్‌రామ్‌, వియాన్‌ ముల్డర్‌లను పెవిలియన్‌కు పంపాడు. అయితే మూడో బంతికి ఆండిలె ఫెహ్లుక్వాయో డిఫెండ్ చేసి వికెట్‌ను కాపాడుకున్నాడు. 13 ఓవర్లో డేవిడ్ మిల్లర్ ను అవేష్ ఖాన్ అవుట్ చేసాడు. 13 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా స్కోరు ఎడు వికెట్లకు 57 పరుగులు. ప్రస్తుతం క్రీజులో కేశవ్ మహారాజ్, ఫెహ్లుక్వాయో ఉన్నారు.

Next Story