ఇంగ్లాండ్ టాప్ లేపిన భారత బౌలర్లు
India Vs England Second Test. చెన్నైలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మొదటి సెషన్ లో భారత బౌలర్లు ఇంగ్లాండ్ టాప్ లేపారు.
By Medi Samrat Published on 14 Feb 2021 11:58 AM IST
చెన్నైలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మొదటి సెషన్ లో భారత బౌలర్లు ఇంగ్లాండ్ టాప్ లేపారు. టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ వెన్ను విరిచారు. కేవలం 39 పరుగులకే ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉంది. అది కూడా తొలి సెషన్ లోనే ఇంగ్లాండ్ 4 వికెట్లను కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ భారత బౌలర్ల ధాటికి వెనువెంటనే వెనుదిరిగారు. ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్ కాగా, సిబ్లీ 16, లారెన్స్ 9, కెప్టెన్ రూట్ 6 పరుగులకే ఔటయ్యారు. బెన్ స్టోక్స్ ఎనిమిది పరుగులతో క్రీజులో ఉన్నాడు. భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 18 ఓవర్లకు 39/4 గా ఉంది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్కు 2, ఇషాంత్ శర్మ, అక్సర్ పటేల్కు చెరో వికెట్ దక్కాయి. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 290 పరుగులు వెనకబడి ఉంది.
భారత్ తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 300/6 తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ ఇంకో 29 పరుగులు మాత్రమే జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. రిషబ్పంత్ (58, 77 బంతుల్లో 7 పోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకంతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ 4, ఒలి స్టోన్ 3, జాక్ లీచ్ 2, జో రూట్ ఒక వికెట్ పడగొట్టారు. భారత బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ 161 పరుగులు సాధించగా.. 67 పరుగులతో రహానే రాణించాడు. ఆదివారం ఆట ప్రారంభించిన తొలి ఓవర్లోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. మోయిన్ అలీ వేసిన ఈ ఓవర్లో అక్షర్ పటేల్(5) స్టంపౌట్ కాగా.. ఇషాంత్ శర్మ(0) రోరీ బర్న్స్ చేతికి చిక్కాడు. ఓ వైపు వికెట్లు పడుతుండగా.. పంత్ మాత్రం ధాటిగా బ్యాటింగ్ చేస్తూ అర్థశతకాన్ని(58 నాటౌట్) సాధించాడు. మరో ఎండ్లో ఉన్న కుల్దీప్ యాదవ్(0), సిరాజ్(4) లను ఒలీ స్టోన్ ఒకే ఓవర్ ఔట్ చేయడంతో 329 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసింది.