T20 World Cup 2026: సూపర్-8లోకి పాక్ వచ్చినా.. మళ్లీ భారత్ గెలిచే ఛాన్స్!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన పోరులో భారత్ క్లినికల్ పెర్ఫార్మెన్స్తో పాకిస్థాన్ను మట్టికరిపించింది.
By - అంజి |
T20 World Cup 2026: సూపర్-8లోకి పాక్ వచ్చినా.. మళ్లీ భారత్ గెలిచే ఛాన్స్!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన పోరులో భారత్ క్లినికల్ పెర్ఫార్మెన్స్తో పాకిస్థాన్ను మట్టికరిపించింది. ఈ విజయంతో టీ20 వరల్డ్ కప్లలో పాక్పై భారత్ రికార్డు 8-1కి చేరింది. కేవలం విజయం మాత్రమే కాదు, 61 పరుగుల తేడాతో పాక్ను ఓడించి, టీ20 చరిత్రలో ఆ దేశంపై భారత్ సాధించిన అతిపెద్ద విజయంగా దీనిని నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ సున్నాకే అవుట్ అయ్యాడు. కానీ, అపాయాన్ని ఆనందంగా ఆహ్వానించే ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై ఇషాన్ కేవలం 40 బంతుల్లో 77 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించాడు. పాక్ స్టార్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను లక్ష్యంగా చేసుకుని, కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇషాన్ విధ్వంసంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 175/7 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది.
పాక్ వ్యూహాత్మక తప్పిదాలు
పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్లో అనేక తప్పిదాలు చేసింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 'అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్' అని వర్ణించిన ఉస్మాన్ తారిఖ్ను ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నప్పుడు బౌలింగ్కు దించకపోవడం పాక్ చేసిన అతిపెద్ద తప్పుగా కనబడుతోంది. సల్మాన్ అలీ ఆఘా నిర్ణయాలు జట్టును ఒత్తిడిలోకి నెట్టాయి. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్, భారత బౌలర్ల దాటికి నిలవలేకపోయింది. మొదటి ఓవర్లోనే హార్దిక్ పాండ్యా సాహిబ్జాదా ఫర్హాన్ను అవుట్ చేసి వికెట్ల పతనాన్ని మొదలుపెట్టాడు. కాసేపు ప్రతిఘటించిన సైమ్ అయూబ్ను బుమ్రా ఒక అద్భుతమైన యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాక్, ఆ తర్వాత కోలుకోలేకపోయింది. బాబర్ ఆజం సైతం అక్షర్ పటేల్ బౌలింగ్లో అనవసర షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. చివరికి పాకిస్థాన్ 114 పరుగులకే (18 ఓవర్లలో) ఆలౌట్ అయింది.
భారత బౌలింగ్ విభాగం
భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ , వరుణ్ చక్రవర్తి పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. కచ్చితమైన లెంగ్త్, లైన్తో బౌలింగ్ చేస్తూ పాక్ బ్యాటర్లకు పరుగులు తీసే అవకాశం ఇవ్వలేదు.
సూపర్-8 లోకి భారత్
ఈ ఘనవిజయంతో భారత్ వరుసగా మూడు విజయాలు నమోదు చేసి సూపర్-8 దశకు దూసుకెళ్లింది. మరోవైపు, ఈ ఓటమితో పాకిస్థాన్ తదుపరి దశకు వెళ్లే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఒక వేళ పాకిస్తాన్ సూపర్-8లోకి వెళ్లినా.. మళ్లీ భారత్తో మ్యాచ్లో తలపడితే ఓటమి తప్పదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.