నేడే టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. కోచ్ గంభీర్కు అసలైన పరీక్ష.. విమర్శకుల నోళ్లు మూతపడతాయ!
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ...
By - అంజి |
నేడే టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. కోచ్ గంభీర్కు అసలైన పరీక్ష.. విమర్శకుల నోళ్లు మూతపడతాయ!
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ, 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్కు చేరుకుంది. టెస్టుల్లో ఓటములు, ఆటగాళ్ల ఎంపికపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న గౌతమ్ గంభీర్, టీ20ల్లో మాత్రం భారత్ను ఒక భీకరమైన శక్తిగా మార్చారు. గంభీర్ కోచింగ్లో భారత్ భయం లేని (Fearless) క్రికెట్ ఆడుతోంది. టీ20ల్లో 250 పరుగులు చేయడం ఇప్పుడు టీమ్ ఇండియాకు అలవాటుగా మారింది. గంభీర్ బాధ్యతలు చేపట్టిన గత 20 నెలల్లోనే భారత్ 15 సార్లు 200 పైచిలుకు స్కోర్లు సాధించింది. ఇందులో ఐదుసార్లు 250 మార్కును దాటడం, బంగ్లాదేశ్పై అత్యధికంగా 297 పరుగులు చేయడం గంభీర్ దూకుడుకు నిదర్శనం.
వ్యక్తిగత రికార్డుల కంటే జట్టే ముఖ్యం:
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పినట్లుగా, గంభీర్ జట్టులో తెచ్చిన అతిపెద్ద మార్పు 'వ్యక్తిగత మైలురాళ్లను' పక్కన పెట్టడం. సెంచరీలు, హాఫ్ సెంచరీల కంటే జట్టు లక్ష్యం కోసమే ప్రతి ఆటగాడు ఆడుతున్నాడు. మొదటి బంతికే సిక్స్ కొట్టాలన్నా, ఇన్నింగ్స్ను మరోలా నిర్మించాలన్నా అది జట్టు ప్రయోజనం కోసమే ఉండాలనేది ఈ జట్టు ఫిలాసఫీ. గంభీర్ హయాంలో భారత బ్యాటర్ల సగటు స్ట్రైక్ రేట్ 158.09గా ఉంది, ఇది ప్రపంచంలోనే అత్యధికం.
ఆటగాళ్లకు అండగా.. విమర్శలకు ఎదురుగా:
గంభీర్ తాను నమ్మిన ఆటగాళ్లను విమర్శలు వచ్చినా వెనకేసుకొచ్చారు. వరుణ్ చక్రవర్తిని తిరిగి జట్టులోకి తీసుకురాగా, అతను ఏడాదిలోనే నంబర్ 1 బౌలర్గా ఎదిగాడు. అలాగే హర్షిత్ రాణాపై విమర్శలు వచ్చినా అతడిని ప్రోత్సహించారు. ఆల్రౌండర్లకు ప్రాధాన్యత ఇస్తూ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబేలతో బ్యాటింగ్ డెప్త్ను పెంచారు. కుల్దీప్ యాదవ్ వంటి స్పెషలిస్ట్ బౌలర్లను బెంచ్పై కూర్చోబెట్టడంపై విమర్శలు వచ్చినా, జట్టు సమతుల్యత కోసమే గంభీర్ ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఫైనల్ తీర్పు అహ్మదాబాద్లోనే:
లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం గంభీర్ పట్టుబట్టడం, సంజూ శామ్సన్ను ఓపెనర్గా తీసుకురావడం వంటి నిర్ణయాలు ఫలితాలను ఇచ్చాయి. ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరు గంభీర్ కోచింగ్ కెరీర్కు అత్యంత కీలకం. స్వదేశంలో సొంత ప్రేక్షకుల ముందు ప్రపంచకప్ను గెలిచి టైటిల్ను నిలబెట్టుకుంటే, గంభీర్ విమర్శకుల నోళ్లు శాశ్వతంగా మూతపడతాయి.భారత క్రికెట్ను ఒక కొత్త ఒరవడిలోకి తీసుకెళ్లిన శిల్పిగా గంభీర్ చరిత్రలో నిలిచిపోతాడు.