ఓట‌మికి కార‌ణం చెప్పిన గిల్

లక్నో సూపర్‌జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఎత్తుగడ ఫ‌లించ‌లేదు.

By Medi Samrat
Published on : 23 May 2025 1:46 PM IST

ఓట‌మికి కార‌ణం చెప్పిన గిల్

లక్నో సూపర్‌జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఎత్తుగడ ఫ‌లించ‌లేదు. ప్లేఆఫ్‌కు ముందు వ్యూహాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నానని, అదే తమ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా మారిందని గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ్యాచ్ అనంతరం చెప్పాడు.

ఐపీఎల్ 2025లో గురువారం జరిగిన 64వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్‌జెయింట్స్ చేతిలో 33 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో తొలుత బ్యాటింగ్ చేసి 235/2 స్కోరు చేసింది. అనంత‌రం గుజరాత్ జట్టు 20 ఓవ‌ర్ల‌లో 202/9 ప‌రుగులు చేసింది.

మేము 15-20 అదనపు పరుగులు ఇచ్చాము. మేము వారిని 210-220 పరుగులకు పరిమితం చేసి ఉంటే, పరిస్థితులు మెరుగ్గా ఉండేవి. ఇది పెద్ద స్కోరు.. ప్లేఆఫ్‌లకు ముందు మా నైపుణ్యాలను పరీక్షించుకోవాలనుకున్నందున మేము ముందుగా బౌలింగ్ చేసాము. ఈ ఎత్తుగడ ఫ‌లించ‌లేదు. మేము పవర్‌ప్లేలో బాగా బౌలింగ్ చేసాము.. మాకు వికెట్లు పడలేదు. కానీ తర్వాతి 14 ఓవర్లలో వారు 180 పరుగులు చేశారు.. ఇది చాలా ఎక్కువ.. మేము 17వ ఓవర్ వరకు మ్యాచ్‌లో ఉన్నాం.. షారుక్‌, రూథర్‌ఫోర్డ్‌ బ్యాటింగ్‌ బాగా చేశారు. తదుపరి మ్యాచ్‌కు పుంజుకోవడం ముఖ్యం అని పేర్కొన్నాడు.

ప్రస్తుత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి ఇది నాలుగో ఓటమి. ప్రస్తుత సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్‌ చేతిలో గుజరాత్‌ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఇది కాకుండా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మాత్రమే గుజరాత్‌ను ఓడించగలిగాయి. గుజరాత్ టైటాన్స్ లీగ్ దశను టాప్-2లో ముగించాలంటే.. తమ చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించాల్సి ఉంటుంది. ఇది కాకుండా గుజరాత్ ఇతర ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. RCB లేదా పంజాబ్ తన లీగ్ మ్యాచ్‌లలో ఒకదానిలో ఓడిపోవాలి. అలా జ‌రిగితే గుజరాత్ టాప్-2లో కొనసాగుతుంది. టాప్-2కు ఫైనల్స్‌కు చేరుకోవడానికి రెండు అవకాశాలు లభించడం విశేషం.

Next Story