గాల్లో తేలిపోతున్న డుప్లెసిస్‌..

Bangalore beat Lucknow by 14 runs.ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు అద‌ర‌గొట్టింది. ల‌క్నోపై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2022 6:07 AM GMT
గాల్లో తేలిపోతున్న డుప్లెసిస్‌..

ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు అద‌ర‌గొట్టింది. ల‌క్నోపై 14 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బెంగ‌ళూరు బ్యాట‌ర్‌ ర‌జ‌త్ ప‌టీదార్ శ‌త‌కంతో చెల‌రేగ‌గా.. బౌల‌ర్లు స‌మ‌యోచితంగా బౌలింగ్ చేసి ల‌ఖ్‌న‌వూను క‌ట్ట‌డి చేశారు. దీంతో ల‌క్నో కెప్టెన్ రాహుల్ పోరాటం వృథా అయింది. ఈ విజ‌యంతో ఆర్‌సీబీ క్వాలిఫయర్‌-2లో శుక్ర‌వారం రాజస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టు ఫైన‌ల్‌కు వెళ్ల‌నుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 207 ప‌రుగులు చేసింది. ర‌జ‌త్ ప‌టీదార్ (112 నాటౌట్‌; 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) శ‌త‌కంతో విజృంభిచ‌గా ఆఖ‌ర్లో దినేశ్ కార్తీక్‌( 37 నాటౌట్‌; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) చెల‌రేగంతో బెంగ‌ళూరు భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ డుప్లెసిస్‌(0), మ్యాక్స్‌వెల్‌ (9), లోమ్రోర్‌ (14), విరాట్ కోహ్లీ(25; 24 బంతుల్లో 2 ఫోర్లు) లు విఫ‌లం అయ్యారు. అనంత‌రం లక్ష్యఛేదనలో లక్నో 193/6 కే ప‌రిమిత‌మైంది. కెప్టెన్ రాహుల్‌(79; 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), దీపక్‌ హుడా(45; 26 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) పోరాడినా ఫ‌లితం లేక‌పోయింది.

ఇక మ్యాచ్ అనంత‌రం బెంగ‌ళూరు కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ఆట‌గాళ్లు అద్భుతంగా ఆడార‌ని, ఈ విజ‌యంతో గాల్లో తేలిన‌ట్టుంద‌ని చెప్పాడు. ర‌జ‌త్ ప‌టీదార్ లాంటి యువ ఆట‌గాడు రాణించ‌డం జ‌ట్టుకు శుభ‌ప‌రిణామ‌ని తెలిపాడు. ఈ టోర్నీల్లో తాను చూసిన అతి గొప్ప శ‌త‌కాల్లో ఇదొక‌టి అని అన్నాడు. మైదానం న‌లువైపులా షాట్లు ఆడాడ‌ని, అత‌డు దూకుడుగా ఆడిన ప్ర‌తిసారీ ప్ర‌త్య‌ర్థుల‌పై ఒత్త‌డి తీసుకువ‌స్తాడ‌ని చెప్పుకొచ్చాడు. ఇక బౌల‌ర్లు ప్ర‌శాంతంగా త‌మ ప‌నిని పూర్తి చేశార‌న్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద విజ‌యం సాధించినా ఈ విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్య‌మ‌ని డుప్లెసిస్ అన్నాడు.

Next Story