స్వ‌ర్ణం అందించిన నీర‌జ్‌కు ఆనంద్ మ‌హీంద్రా ఇస్తున్న బ‌హుమ‌తి ఇదే..!

Anand Mahindra to gift XUV700 SUV to Neeraj Chopra.అథ్లెటిక్స్‌లో తొలి ఒలింపిక్ ప‌త‌కం కోసం భార‌త్ వందేళ్ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Aug 2021 2:10 AM GMT
స్వ‌ర్ణం అందించిన నీర‌జ్‌కు ఆనంద్ మ‌హీంద్రా ఇస్తున్న బ‌హుమ‌తి ఇదే..!

అథ్లెటిక్స్‌లో తొలి ఒలింపిక్ ప‌త‌కం కోసం భార‌త్ వందేళ్ల నిరీక్ష‌ణ ఫ‌లించింది. జావెలిన్ త్రోలో స్వ‌ర్ణం గెలిచి నీర‌జ్ చోప్రా చ‌రిత్ర సృష్టించాడు. రెండో త్రోను 87.58 మీట‌ర్లు విసిరి అత‌డు బంగారు ప‌త‌కాన్ని ఖాయం చేసుకున్నాడు. ప‌సిడి గెలిచిన అనంత‌రం త్రివ‌ర్ణ ప‌త‌కాన్ని చేబూని సంబ‌రాలు చేసుకున్నాడు. 1920 నుంచి ఒలింపిక్స్‌లో పోటీప‌డుతున్న భార‌త్‌కు అథ్లెటిక్స్‌లో నీర‌జ్ క‌న్నా ముందు ఎవ‌రూ ప‌త‌కం అందించ‌లేక‌పోయారు. ప్ర‌స్తుతం నీర‌జ్ పై ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురుస్తోంది.

ఇక మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్ మహీంద్రా.. నీర‌జ్ చోప్రాకు ఓ బ‌హుమ‌తిని ప్ర‌క‌టించారు. త‌మ సంస్థ నుంచి కొత్త‌గా మార్కెట్‌లోకి తీసుకురాబోతున్న ఎక్స్‌యూవీ 700మోడ‌ల్ వాహ‌నాన్ని అత‌డికి బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్న‌ట్లు ట్వీట్ చేశారు. నిరజ్ చోప్రాను బాహుబలితో పోలుస్తూ మేమంతా నీ సైన్యం, బహుబలి అంటూ రాసుకొచ్చారు. తన వెనుక భారీ సైన్యంతో.. చేతిలో ఈటెను పైకెత్తి గుర్రంపై వ‌స్తున్న ప్ర‌భాస్ ఫోటోతో పాటు ఈటెను విసురుతున్న నీర‌జ్ చోప్రా ఫోటోను ఆయ‌న షేర్ చేశారు. ఆ ట్వీట్‌కు బ‌దులిస్తూ నీర‌జ్‌కు ఎక్స్‌యూవీ 700 బ‌హుమ‌తిగా ఇవ్వాలంటూ.. ఆనంద్ మ‌హీంద్రాను రితేశ్ జైన్ అనే వ్య‌క్తి కోరాడు.

ఇందుకు బ‌దులుగా ఆనంద్ మ‌హీంద్రా మ‌రో ట్వీట్ చేశారు. త‌ప్ప‌కుండా.. మ‌న గోల్డెన్ అథ్లెట్‌కు ఎక్స్‌యూవీ గిఫ్ట్‌గా ఇవ్వ‌డం నా అదృష్టం. నాకు కూడా గౌరవమే. అంటూ మ‌హీంద్ర కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల‌ను ఆ పోస్ట్‌లో ట్యాగ్ చేస్తూ వెంట‌నే ఒక ఎక్స్‌యూవీ ని నీర‌జ్ చోప్రా కోసం సిద్ధం చేయాల‌ని ట్వీట్ చేశారు. ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు సాధించిన ఇత‌ర భార‌తీయ క్రీడాకారుల‌కు ప‌లు కంపెనీలు ఇలాగే వినూత్న బ‌హుమ‌తుల‌ను ప్ర‌క‌టించ‌డం విశేషం.

Next Story