అలాంటి విద్యార్థులకు పరీక్షలు వద్దు: కేంద్రం

By సుభాష్  Published on  11 Sep 2020 9:48 AM GMT
అలాంటి విద్యార్థులకు పరీక్షలు వద్దు: కేంద్రం

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణలో అనుసరించే స్టాండర్డ్‌ ఆపరేటింట్ ప్రోసీజర్‌ (ఎస్‌వోపీ)లను కేంద్ర ప్రభుత్వం సవరించింది. కరోనా లక్షణాలతో ఎవరైన విద్యార్థులు పరీక్ష రాయడానికి వస్తే వారిని దగ్గరలోని ఆస్పత్రికి పంపాలని, వారికి మరో తేదీని కేటాయించడమే.. లేక మరో మార్గం ద్వారా పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు ఎస్‌ఓపీను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

కోవిడ్‌ లక్షణాలున్న వారు పరీక్ష రాయాలనుకుంటే వారికి కూడా అవకాశం కల్పించాలని గతంలో ఇచ్చిన మార్గదర్శకాల్లో కేంద్రం తెలిపింది. అయితే తాజాగా ఈ మార్గదర్శకాలను సవరించింది. ఈ సవరించిన మార్గదర్శకాలు పరీక్షలు నిర్వహించే అన్నియూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కేవలం కరోనా లక్షణాలు లేని విద్యార్థులు, సిబ్బంది మాత్రమే పరీక్ష కేంద్రాలకు రావాలని తెలిపింది. ఒక వేళ కోవిడ్‌ లక్షణాలున్న వారు పరీక్షకు హాజరైతే వారిని అనుతించాలా..? వద్దా.? అనే విషయంపై చర్చించి ఈ మేరకు మార్గదర్శకాలను సవరిస్తూ ప్రకటన చేసింది.

అలాగే కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉండే పరీక్ష సిబ్బంది, నిర్వాహకులు పరీక్ష కేంద్రాలకు అనుమతి లేదని గతంలో జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది కేంద్రం. అంతేకాకుండా కేంద్రాల వద్ద మాస్క్‌లు , శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించింది.

Next Story