సోనియా గాంధీ అధ్యక్షతన పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు భేటీ
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 May 2020 4:29 AM GMTకాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు భేటీ కానున్నాయి. కేంద్రం ప్రకటించిన భారీ ఎకనామిక్ ప్యాకేజీ.. లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులు, లేబర్ లా కి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 22 వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 పార్టీలు ఈ మీటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం.
అలాగే.. ఈ సమావేశంలో కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం.. పార్లమెంటు సమావేశాలు లేకపోయినా.. వివిధ పార్లమెంటరీ కమిటీల స్థంభనపై కూడా చర్చ జరగనుంది. ఇక ఈ సమావేశానికి హాజరవుతానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్సటికే ప్రకటించగా... డీఎంకే అధినేత స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలావుంటే.. వలస కార్మికులను కేంద్రం విస్మరించిందని, వాళ్లను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని సోనియా గాంధీ కేంద్రంపై విమర్శలు చేశారు. శ్రామిక్ రైళ్లలో ప్రయాణిస్తున్న వలస కార్మికుల వద్ద నుంచి కేంద్రం టికెట్కు డబ్బులు వసూలు చేయడం అన్యాయమని.. వారి టికెట్ డబ్బులు తానే భరిస్తానని సోనియా గాంధీ గతంలో ప్రకటించారు.