ఎస్ఎంఎస్( సబ్బు/శానిటైజర్, మాస్కు, సోషల్ డిస్టెన్స్) విధానాన్ని పాటిద్దాం - కోవిడ్ ను ఎదుర్కొందాం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Aug 2020 10:13 AM GMT
ఎస్ఎంఎస్( సబ్బు/శానిటైజర్, మాస్కు, సోషల్ డిస్టెన్స్) విధానాన్ని పాటిద్దాం - కోవిడ్ ను ఎదుర్కొందాం

దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీనికితోడు అన్ లాక్ 3.0 పేరుతో కేంద్రప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.

ఈ నేపథ్యంలోనే కోవిడ్-19 కేసుల సంఖ్య రోజుకు 50వేల‌కు పైనే నమోదువుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రజలు మాస్కు ధరించడం, భౌతిక పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు. మార్కెట్లో మందులు వచ్చేస్తున్నాయన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనావుంది. ఇందుకోసం మన పాటించాల్సిన ముఖ్యమైన విధానం

కోవిడ్-19 ను ఎదుర్కొనడానికి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఆయుధాల్లో ఈ ఎస్.ఎం.ఎస్ విధానం అతి ముఖ్యమైనది.

సబ్బు లేదా శానిటైజర్

మనం పనిచేసుకుంటున్న ప్రదేశంలోగానీ, ఇంట్లో గానీ, బయట కూరగాయలకు వెళ్లినపుడు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు ఇలా అనేక సార్లు మనం చేతులతో ఎన్నో వస్తువులను తాకుతూ ఉంటాం. అవే వస్తువలను మనకు తెలియకుండా ఎంతోమంది తాకి ఉంటారు. అందువల్ల కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇంటికి రాగానే సబ్బు అయితే కనీసం 20 సెకన్ల నుంచి 40 సెకన్లపాటు మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

వంట వండే ముందూ, వండిన తర్వాత, ఆహారం తీసుకునేటప్పుడు, తీసుకున్న తర్వాత, మాంసం, చేపలూ మొదలయిన నాన్ వెజ్ పదార్థాలు శుభ్రం చేసేటప్పుడు, పిల్లలకు ఆహారం పెట్టే ముందు ఇలా ప్రతిసారి సబ్బుతోనూ, నీళ్లతోనూ చేతులు శుభ్ర పరుచుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్లినట్టయితే తప్పనిసరిగా శానిటైజర్ దగ్గర ఉంచుకోవడం అవసరం.

మాస్కు ధరించడం

కోవిడ్ ను మన నుంచి ఇతరులకు, ఇతరుల నుంచి మనకు వ్యాప్తి చెందకుండా ఉంచే మార్గాల్లో మాస్కు ధరించడం కీలకమైనది. ప్రతిఒక్కరూ మాస్కు పెట్టుకోవడం ద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి. మాస్కులు పెట్టుకోకపోతే ఫైన్లు కూడా విధిస్తున్నారు. అందుకే ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మూడు లేయర్ల మాస్క్ కానీ, ఇంట్లో తయారు చేసిన మాస్క్ కానీ తప్పనిసరిగా ధరించాలి. మాస్కును ప్రతిరోజూ మారుస్తూ ఉండాలి. మాస్కును ఉతికిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి.

భౌతిక దూరం

కోవిడ్ ను ఎదుర్కోనేందుకు మన దగ్గరున్న మరో ఆయుధం భౌతిక దూరం. ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే తప్పనిసరిగా ఎదుటి వ్యక్తికి కనీసం ఆరు అడుగులు లేదా 2 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కూరగాయల మార్కెట్‌లోను, కిరాణా షాపులకు వెళ్లినపుడు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు, ఆఫీసులో పనిచేసే సమయంలో, ప్రయాణ సమయంలో, ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.

పైన సూచించిన విధంగా ప్రతిఒక్కరూ ఎస్.ఎం.ఎస్ (సబ్బు/శానిటైజర్, మాస్కు, సోషల్ డిస్టెన్స్) విధానాన్ని పాటించడం ద్వారా కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టే అవకాశాలు ఉంటాయి. ఈ మూడింటిని తప్పనిసరిగా పాటిస్తూ ముందుకు సాగుదాం. కోవిడ్ మహమ్మారిని జయిద్దాం.

Next Story