రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు
By సుభాష్ Published on 24 April 2020 4:52 AM GMTదర్శకధీరుడు రాజమౌళి. ఈ పేరు తెలియనివారుండరు.. రాజమౌళి అంటేనే ఒక చరిత్ర. రాజమౌళి అంటే నచ్చని హిందీ వాళ్లు సైతం జైకొట్టిన సందర్భాలున్నాయి. ఏదైనా సంచలనం సృష్టించాలంటే అది జక్కన్నకే సొంతమని చెప్పాలి. తెలుగులో కూడా ఇలాంటి దర్శకులు ఉన్నారా... అనేంతగా రాజమౌళి ఎదిగిపోయారు. అలాంటి దర్శకుడిపై ఏదైన వ్యాఖ్యలు చేయాలంటే ఆలోచిస్తుంటారు. పైగా రాజమౌళి వివాదాలకు దూరంగానే ఉంటారు. దేనిలో తలదూర్చడు. ఆయన పని ఆయనే చేసుకుపోతుంటారు. అలాంటి దర్శకుడిపై ఓకుర్ర దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నీ సినిమాలన్నీ కాపీ.. ఒరిజినాలిటీ లేని నువ్వు.. అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఒకే ఒక్క సినిమా అనుభం కలిగిన ఈ యువ దర్శకుడు డిజాస్టర్ సినిమా ఇచ్చిన దర్శకుడు ఇప్పుడు జక్కన్నపై కామెంట్ చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి పారసైట్ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను చూస్తుంటే నాకు నిద్ర వచ్చేస్తోంది.. అసలు నాకు నచ్చలేదని, సినిమా చూస్తూ మధ్యలోనే నిద్ర వచ్చేసిందని, ఆ తర్వాత నా భార్య కథ చెప్పినా పెద్దగా నచ్చలేదని చెప్పుకొచ్చాడు రాజమౌళి. దాంతో ఇది కాస్త వివాదంగా మారింది. అయితే నాకు ఆ సినిమా నచ్చకపోయిన మాత్రాన అది గొప్ప సినిమా కాకుండాపోదని చెప్పుకొచ్చారు రాజమౌళి. తనకు నచ్చదగ్గ సినిమా ఏమి కాదని అన్నారు.
కాగా, నాలుగు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న సినిమా మీకు నచ్చలేదా అంటూ కొందరు రాజమౌళిపై విమర్శలు చేశారు. ఇప్పుడు రాజమౌళి వ్యాఖ్యలపై ఆ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత ఏడాది ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా మిఠాయి సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ లేఖ ద్వారా రాజమౌళిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ట్వీట్ చేశాడు.
ఇంత అద్భుతమైన ఒరిజినాలిటీ కలిగిన సినిమాను ప్రపంచ వ్యాప్తంగా దర్శకులు సైతం ప్రశంసించారు. సినిమా అనే అడ్డగోడలు కూల్చేసిందని ట్వీట్లో పేర్కొన్నారు. కానీ బాహుబలిని ప్రపంచ ప్రఖ్యాత డైరెక్టర్లు మాట్లాడినట్లు తాను ఎక్కడ వినలేదని, చూడలేదని అన్నారు. ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటే మీ 'సై' మూవీలో ఓ సీన్ మొత్తాన్ని కాపీ చేశారు. తీసిన మరికొన్ని సినిమాలన్నీకాపీలే. అద్భుతమైన పారాసైట్ చిత్రం గురించి కామెంట్ చేయడం సరైంది కాదు.. అంటూ ప్రశాంత్ కుమార్ విమర్షల వర్షం కురిపించాడు.
కాగా, కేవలం పబ్లిసిటీ కోసమే ప్రశాంత్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటూ కొందరు ఆయనపై విమర్శలు చేశారు. అయితే ఈ సినిమా కొందరికి నచ్చుతుంది.. కొందరికి నచ్చదు.. అంత మాత్రాన విమర్శలు చేయడం సరైంది కాదు అంటూ ప్రశాంత్ కుమార్ హితవు పలికారు.