తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ కాలింగ్‌కు తీవ్ర అంతరాయం

తెలుగు రాష్ట్రాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి మొబైల్‌ నెట్‌వర్క్‌లో కాల్‌ డ్రాప్‌ సమస్య తలెత్తింది.

By అంజి  Published on  6 Aug 2023 2:10 AM GMT
Airtel, Call drops, Hyderabad,  Telugu States

తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ కాలింగ్‌కు తీవ్ర అంతరాయం

తెలుగు రాష్ట్రాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి మొబైల్‌ నెట్‌వర్క్‌లో కాల్‌ డ్రాప్‌ సమస్య తలెత్తింది. కాల్ డ్రాప్స్, బలహీనమైన సిగ్నల్, పేలవమైన వాయిస్ నాణ్యత మొబైల్ వినియోగదారులను నిన్నటి నుంచి ఇబ్బంది పెడుతోంది. మొబైల్ వినియోగదారులు నెట్‌వర్క్ అంతరాయంపై తమ నిరాశను వ్యక్తం చేశారు. వాయిస్ కాల్‌లు చేయకుండా నిరోధం ఏర్పడింది. అయితే ఇంటర్నెట్ సేవలపై ఎలాంటి ప్రభావం లేదు. ఫోన్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేయడంలో టెక్నికల్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. కాల్‌ రిసీవ్‌ చేసుకున్న వెంటనే కాల్‌ కట్‌ కావడం లేదా మాట్లాడుతుండగా సిగ్నల్‌ పోవడం వంటివి జరుగుతున్నాయి.

సాధారణంగా ప్రయాణ సమయాల్లో ఒక టవర్‌ నుంచి మరో టవర్‌కి సిగ్నల్‌ మారుతున్నప్పుడు కాల్‌ డ్రాప్‌ అవుతుంటుంది. అయితే ఇప్పుడు ఒకే దగ్గర ఉన్నా కూడా కాల్‌ డ్రాప్‌ సమస్య తలెత్తుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ కారిడార్‌లోని ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాట్సాప్‌ కాల్‌ల ద్వారా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా, చాలా మంది మొబైల్ వినియోగదారులు సుదీర్ఘంగా ఉన్న మొబైల్ నెట్‌వర్క్ అంతరాయాన్ని నివేదించారు. నిరాశను వ్యక్తం చేశారు. వెంటనే నెట్‌వర్క్‌లను పునరుద్ధరించాలని అధికారులను కోరారు.

ఈ సమస్యను గుర్తించిన ఎయిర్‌టెల్, జియో అధికారులు సేవలను పునరుద్ధరించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ తలెత్తిందని, సేవలను పునరుద్ధరిస్తున్నామని ఆయా నెట్‌వర్క్‌ సంస్థల ప్రతినిధులు చెప్తున్నారు. సేవలు పునరుద్ధరించబడే వరకు ల్యాండ్‌లైన్ మరియు ఇంటర్నెట్ కాలింగ్‌లను ఉపయోగించాలని స్థానిక అధికారులు ప్రజలను కోరారు.

Next Story