దేశ రాజధానిలో ముగిసిన సరి-బేసీ విధానం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 11:13 AM GMT
దేశ రాజధానిలో ముగిసిన సరి-బేసీ విధానం

ఢిల్లీ: దేశ రాజధానిలో సరి-బేసి విధానం ఈరోజుతో ముగియనుంది. సరి-బేసి విధానం ముగియడంతో శనివారం నుంచి అన్ని వాహనాలు రోడ్లపైకి రానున్నాయి. అయితే నగరంలో కాలుష్యం తగ్గించేందుకు సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం సరి- బేసి విధానం ప్రవేశపెట్టింది.

Kejriwal

కానీ కేజ్రీవాల్‌ తీసుకున్న ఈ చర్య ఏ మాత్రం ఫలితం ఇచ్చినట్లు కనిపించలేదు. పైగా అక్కడ మరోసారి కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. కాగా శనివారం నుంచి అన్ని వాహనాలు రోడ్లపైకి రానున్న నేపథ్యంలో.. మరింత కాలుష్య సమస్య ఏర్పడే అవకాశం ఉంది.

దీనిపై ఇప్పటికే వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో వాయునాణ్యత సూచి 900పైగా నమోదయింది. లోభి రోడ్ సహా పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 5 వందల స్థాయిని తాకింది. వాయునాణ్యత సూచి 2 వందలు మించితేనే ప్రమాదకరంగా భావిస్తారు. అలాంటిది 8 వందల వరకు నమోదు కావడం గుబులు పుట్టిస్తోందని అధికారులు చెబుతున్నారు.

ఈ మేరకు ఢిల్లీలో ఇవాళ కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ విద్యార్థులకు శ్వాసకోస సమస్యలు, ఆస్తమ తదితర రోగాలు వస్తున్నాయంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అయితే పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు తగులబెట్టడం తగ్గినా.. కాలుష్య ప్రభావం మాత్రం ఢిల్లీలో అంతగా తగ్గలేదని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అంతే కాకుండా..దుమ్ముధూళి, పొగమంచు ఢిల్లీవాసులను ఇబ్బందిపెడుతుంది.

ఇదిలా ఉంటే.. మరోవైపు ఢిల్లీలో సరి-బేసి విధానం కొనసాగించాలా? వద్దా?. అన్న విషయంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

Next Story